ములుగు : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్లను పెద్ద మొత్తంలో తరలిస్తుండగా ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వెంకటాపూర్ నూగూరు ఎస్సై అశోక్, సీఆర్పీఎఫ్ పోలీస్లతో కలిసి గురువారం ఉదయం వాహనాల తనిఖీలు చేస్తుండగా భద్రాచలం నుంచి వెంకటాపురం వైపు వస్తున్న స్కార్పియో కారు అనుమానాస్పదంగా కనిపించాయి. పోలీసులు తనిఖీ చేయగా చలామణిలో లేని రూ. కోటీ 65లక్షల విలువైన రూ. 1000, 500 నోట్లు రెండు బ్యాగుల్లో లభించాయి. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారించి, కీలక విషయాలు రాబట్టారు.
సూర్యాపేట జిల్లా కడిగూడెం మండలం కేశవాపురం గ్రామానికి చెందిన పప్పుల నాగేంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా వ్యాపారాలు చేయాలనుకొన్నాడు. దీంతో హైదరాబాద్కు చెందిన వెంకట్రెడ్డి, నవీన్రెడ్డిలకు రూ.5 లక్షలు చెల్లించి రూ.2కోట్ల విలువైన పాత కరెన్సీని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్కుమార్, ఎస్సై అశోక్, ఆర్ఎస్ఐ స్వామి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.