ఆరు నెలల్లో 15,606 (78%) యూనిట్లకు రుణాన్ని అందించింది. దీంతో అదనంగా మరో 15వేల యూనిట్లకు కూడా రుణం ఇవ్వడానికి స్త్రీనిధి సంస్థ సిద్ధమైంది. వచ్చే ఆరు నెలల్లో మరో 15 వేలకు పైగా యూనిట్ల పంపిణీ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 50 కోళ్ల యూనిట్కు రూ.12,250లు, 100 కోళ్ల యూనిట్కు రూ.22వేల రుణాన్ని అందిస్తున్నారు. 50 కోళ్ల కంటే 100 కోళ్ల యూనిట్ను ఏర్పాటు చేసుకోవడానికే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. దీని ద్వారా నెలకు రూ.1850 వరకు లాభం వస్తుందని అంచనా వేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): నాటు కోడి మాంసానికి నగరాల్లో డిమాండ్ పెరుగుతున్నది. ఫారం కోళ్ల కన్నా పెరటికోళ్ల పెంపకం ఎక్కువగా లాభదాయకంగా ఉండటంతో గ్రామీణులు వాటి పట్ల మొగ్గుచూపుతున్నారు. స్త్రీనిధి సంస్థ నుంచి రుణాలు తీసుకొని పెరటి కోళ్లు పెంచేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ముందుకొస్తున్నారు. ఇంటి దగ్గరే పెంచుకోవడం, పెట్టుబడికి కావాల్సిన రుణం లభిస్తుండటంతో మహిళలు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో లక్ష్యాని కంటే అధికంగా రుణాల కోసం ఒత్తిడి వస్తున్నదని అధికారులు చెప్తున్నారు. బాయిలర్ కోళ్ల కంటే రుచిగా ఉండటం, ధర కూడా కొద్దిగా అటూ ఇటుగా ఉండటంతో పెరటి కోళ్లను తినడానికి మొగ్గు చూపుతున్నారు. ఇవి అధిక రోగ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. కొద్ది రోజుల్లోనే అమ్మకానికి అవసరమైన స్థాయిలో పెరుగుతాయి. ఈ నేపథ్యంలో వీటిని పెంచడానికి మహిళా సంఘాల సభ్యులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా యూనిట్లు ఏర్పాటయ్యాయి. తీసుకున్న రుణాన్ని 2 ఏండ్లలో 11 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది.
కోళ్ల యూనిట్లకు డిమాండ్ పెరగడంతో మదర్ యూనిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. మదర్ యూనిట్లు కూడా విరివిరిగా సమీప ప్రాంతంలోనే అందుబాటులో ఉండటం వల్ల పిల్లలను తెచ్చుకొనేందుకు వీలుగా మదర్ యూ నిట్లకు కూడా రుణాలు ఇస్తున్నారు. అయితే దీని ఏర్పాటు చేయడానికి శిక్షణ తీసుకున్న వారికి మాత్రమే రుణాన్ని ఇస్తున్నారు.