న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్ సీక్వెన్సింగ్లో తేలింది. దాదాపు 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్గా గుర్తించారు. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఒక సమావేశంలో ఆరోగ్యశాఖకు పలు వివరాలు తెలిపింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 83.3 శాతం శాంపిల్స్లో డెల్టా వేరియంట్ (B.1.617.2) గుర్తించినట్లు పేర్కొంది.
మేలో 81.7, జూన్లో 88.6, ఏప్రిల్లో 53.9 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) లో ఢిల్లీ నుంచి 5,752 శాంపిల్స్లో 1,689లో డెల్టా, 947 నమూనాలు ఆల్ఫా వేరియంట్ కేసులు రికార్డయ్యాయి. ఈ రెండు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లిష్టమైన వేరియంట్లుగా వర్గీకరించింది. గతేడాది డిసెంబర్లో భారత్లో గుర్తించిన వేరియంట్ ఇప్పటికీ 95కిపైగా దేశాలకు పాకింది.
రెండో దశ ఉధృతికి డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని గుర్తించారు. లక్షలాది మంది జనం వేరియంట్ బారినపడగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్ఫా వేరియంట్ను గతేడాది యూకేలో కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఢిల్లీలో కొవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 25,066కు పెరిగింది. 24 గంటల్లో ఒక్క మరణం నమోదుకాకపోవడం వారంలో ఇది మూడోసారి.