న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ 2048 ఒలింపిక్స్ క్రీడల కోసం బిడ్ వేస్తుందని అన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీనికోసం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రోడ్మ్యాప్ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. 2048లో ఢిల్లీలో ఒలింపిక్స్ జరిగేలా ఓ విజన్ను మేము రూపొందించాం. దీని కోసం కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా గొప్ప బడ్జెట్ రూపొందించారని కేజ్రీవాల్ అన్నారు. రూ.69 వేల కోట్లతో మంగళవారం సిసోడియా బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీ తలసరి ఆదాయాన్ని 2047లోపు సింగపూర్ స్థాయికి తీసుకెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తెలిపింది. దీనికోసం 16 శాతం ఆదాయం పెరగాల్సి ఉందని సిసోడియా చెప్పారు.