న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి రుతుపవనాలు ఆలస్యంగా చేరినా.. ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. జూలైలో ఇప్పటివరకు నగరంలో 381 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 2003 తర్వాత జూలైలో ఇదే వర్షాపాతమని ఐఎండీ అధికారులు తెలిపారు. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో మంగళవారం ఉదయం కేవలం మూడు గంటల్లోనే వంద మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని పేర్కొంది. ఇంతకు ముందు 2013, జూలై 21న 123.4 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 19 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఏడాది దేశ రాజధానికి రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరాయి. ఇప్పటి ఈ నెలలో 14 రోజులు వర్షాలు కురిశాయి. భారీ వానలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.
ఐఎండీ డేటా ప్రకారం.. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో ఈ నెల 27 వరకు 108 శాతం అధిక వర్షాపాతం రికార్డయింది. సాధారణ వర్షాపాతం 183.5 మిల్లీమీటర్లు. 2003లో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 632.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత కొద్ది సంవత్సరాలుగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిందని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ (మెట్రాలజీ) మహేశ్ షలావత్ పేర్కొన్నారు. నగరాల్లో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వర్షాపాతం నమోదవుతుందన్నారు. ఇంతకు ముందు మూడు, నాలుగు రోజుల్లో 100 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైతే.. ప్రస్తుతం ఐదారు గంటల్లోనే రికార్డవుతుందన్నారు. ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరుగవని, వర్షాపాతం నెమ్మదిగా ఉంటే భూమిలోకి నీరు ఇంకే అవకాశం ఉంటుందన్నారు.