Summons to MLA | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు రావాలని ఆయనను పోలీసులు ఆదేశించారు. హిందూ దేవుళ్ల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను అడ్డం పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ను సాధించాలని బీజేపీ నేతలు కుట్రపన్నారని, తమ నేతకు తలనొప్పులు రాకూడదనే ముందస్తుగా మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు రాజేంద్ర పాల్ గౌతమ్ వెల్లడించారు.
ఢిల్లీ ప్రభుత్వ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ను పోలీసులు విచారణకు పిలిచారు. విజయదశమి పండగ రోజున ఢిల్లీలో జరిగిన బౌద్ధ సదస్సులో హిందూ దేవతల పట్ల అవిధేయత చూపుతానని ప్రమాణం చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఈ వీడియోను షేర్ చేస్తూ రాజేంద్ర పాల్ గౌతమ్ను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ డిమాండ్ నేపథ్యంలో ఆదివారం నాడు ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చినా.. నోటీసులు తీసుకునేందుకు గౌతమ్ నిరాకరించినట్లుగా తెలుస్తున్నది. అందుకే మరోసారి ఇవాళ పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు.
ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో గౌతమ్ మాట్లాడుతూ.. తనకు ఎటువంటి నోటీసు అందలేదని, పోలీసులు నన్ను విచారించడానికి రాగా.. వారు కోరిన సమాచారం ఇచ్చానని తెలిపారు. తనపై అనవసర ఆరోపణలు చేసిన బీజేపీ.. తనను అడ్డం పెట్టుకుని తమ నేత అరవింద్ కేజ్రీవాల్పై కత్తి దూయాలని చూస్తున్నదని చెప్పారు. తమ నేతకు ఎలాంటి అవమానం జరగొద్దనే ముందస్తుగా మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు గౌతమ్ తెలిపారు.