న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతానికి రోజుకు 700 టన్నులు అవసరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోటాను 378 టన్నులకు నుంచి 480 టన్నులకు పెంచిందని, అయినా ఇంకా చాలా అవసరమన్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి లేదని, ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా జరుగుతుందని తెలిపారు. పలు కంపెనీలు, ప్రభుత్వాలు ఢిల్లీకి సరఫరా నిలిపివేశాయన్నారు. మొదట తమ రాష్ట్రాల్లోనే ఆక్సిజన్ వినియోగించుకుంటామని చెప్పాయన్నారు.
ఢిల్లీ కోటాను కూడా ఉపయోగించుకుంటూ.. ట్రక్కులను ఢిల్లీకి రానివ్వడం లేదన్నారు. గత రెండు మూడు రోజులుగా కేంద్రం, ఢిల్లీ హైకోర్టు చొరవతో ఆక్సిజన్ సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన కోటా ప్రకారం ఒడిశా నుంచి ఆక్సిజన్ రావాల్సి ఉందని, ఇక్కడికి వచ్చేందుకు సమయం పడుతుందని, అవసరమైతే విమానం ద్వారా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధానిలో వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ఐక్యత చాటాలన్నారు.
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ ఐసీయూ పడకల కొరత ఉందని, ఈ మేరకు పడకలు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 7వేల పడకలను ఏర్పాటు చేయాలని కోరితే 2వేలు వచ్చాయని తెలిపారు. మూడు రోజులుగా తీవ్రమైన ఆక్సిజన్ సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు కేటాయించే కోటాను కేంద్రం పెంచిందని, అయినా అవసరం కంటే తక్కువగానే ఉందన్నారు.