న్యూఢిల్లీ: “మేం నరకాన్ని చూస్తున్నాం.. ప్రతి ఒక్కరూ నరకాన్ని చూస్తున్నారు.. మాకు సాయం చేయాలని ఉన్నా మేం నిస్సహాయులం”. బ్లాక్ ఫంగస్ మందుల కొరతపై ఢిల్లీ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత వైద్య వ్యవస్థ దుర్భర స్థితికి అద్దం పడుతున్నాయి. బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న ఇద్దరు రోగులకు మందుల సరఫరా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు విపిన్ సంఘీ, జస్మీత్ సింగ్ తో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. మందుల సేకరణకు, కొరత నివారణకు చేపడుతున్న చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. ప్రస్తుత దిగుమతులు, నిల్వల పరిస్థితి వివరించమని కోర్టు ఆదేశించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే లిపోసోమల్ యాంపోటెరిసిన్-బీ మందు 2.3 లక్షల వయల్స్ తెప్పిస్తున్నామని కేంద్రం తరఫు న్యాయవాది తెలియజేసినప్పుడు కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుత అవసరం చాలా ఎక్కువగా ఉందని, ఈ సంఖ్య ఎలా నిర్ధారించారో తెలియజేయమని ఆదేశించింది. అసలు దిగుమతుకి మందు అందుబాటులో ఉందా అని నిలదీసింది. కాగా పిటిషనర్లకు కోర్టు తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఒకరికి మందు ఇవ్వమని, ఇతరులకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేయలేమని కోర్టు తెలిపింది. అంతేకాకుండా కేంద్రం చెప్పిన 2.3 లక్షల వయల్స్ అసలు పరిస్థితి ఏమిటని అడిగింది. అవి ఎక్కడున్నాయి? ఏ దశలో ఉన్నాయి? భారత్కు ఎప్పుడు చేరుకుంటాయి? ఈసరికే ఆర్డరు చేశారా లేదా? అంటూ శరపరంపరగా కోర్టు ప్రశ్నలు సంధించింది. ఆర్డరు చేశామని కేంద్ర న్యాయవాదులలో ఒకరు తెలిపినపుడు.. “మే 24న ఆర్డరు చేస్తే ఈ సరికే రావాలి” అని కోర్టు పేర్కొన్నది. “ప్రస్తుతం ఈ వ్యాధి విస్తరిస్తున్న తీరు పట్ల మా ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం.. గంటగంటకూ పరిస్థితి మారుతున్నది. ప్రాణాలు కాపాడడం ఇక్కడ ముఖ్యం. ప్రతి గంటా విలువైనదే” అని కోర్టు తెలిపింది.