న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటడంతో తక్షణమే సరఫరాలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. తమ వద్ద వారం, పదిరోజులకు సరిపడా మాత్రమే వ్యాక్సిన్ నిల్వలున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికి వయో పరిమితిని తొలగించాలని ఆయన మరోసారి కేంద్రాన్ని అభ్యర్ధించారు.
మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ కొరత నెలకొందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమ వద్ద ఉన్న వ్యాక్సిన్ నిల్వలు కేవలం ఐదు రోజులకే సరిపోతాయని పంజాబ్ వెల్లడించింది. తాము రోజుకు రెండు లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలనే లక్ష్యాన్ని అధిగమిస్తే కేవలం మూడు రోజుల్లోనే వ్యాక్సిన్ నిల్వలు అడుగంటుతాయని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే వ్యాక్సిన్ సరఫరాలు మాత్రం ఆస్ధాయిలో లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.