ఢిల్లీ ,మే, 28: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డైరెక్టరేట్ జనరల్, రక్షణ శాఖ కార్యదర్శి డా.అజయ్ కుమార్ ఎన్సీసీ మొబైల్ శిక్షణ యాప్ 2.0’ను ఢిల్లీ లో ప్రారంభించారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్సీసీ క్యాడెట్లకు ఈ యాప్ ద్వారా ఆన్లైన్లోనే శిక్షణ కొనసాగించవచ్చు. ఎన్సీసీ సంబంధిత ప్రాథమిక సమాచారం, సంపూర్ణ శిక్షణాంశాలను (పాఠ్యాంశాలు, ప్రసంగ పాఠాలు, శిక్షణ దృశ్యాలు, తరచూ అడిగే ప్రశ్నలు) ఒకే వేదిక ద్వారా అందించడం దీని లక్ష్యం. శిక్షణాంశాలను ఉపయోగించుకోవడానికి, ప్రస్తుత పరిస్థితుల్లో శిక్షణను కొనసాగించడానికి ఎన్సీసీ క్యాడెట్లకు ఈ యాప్ ఎంతగానో సహాయపడనున్నది.
కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఆన్లైన్ ద్వారా క్యాడెట్లకు శిక్షణ కొనసాగించడంపై ఎన్సీసీని డా.అజయ్ కుమార్ అభినందించారు. కొవిడ్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ఎన్సీసీ క్యాడెట్లకు కొత్త వెర్షన్ ఉపయోగపడుతుందన్నారు.ఎన్సీసీ క్యాడెట్లు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఈ యాప్ ద్వారానే ఆన్లైన్ శిక్షణ, పరీక్షలకు హాజరు కావచ్చని చెప్పారు. యాప్ను అభివృద్ధి చేసినందుకు ఎన్సీసీ సిబ్బందిని డా.అజయ్ కుమార్ ప్రశంసించారు. ఎన్సీసీ శిక్షణను ఆన్ లైన్ చేయడం ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘డిజిటల్ ఇండియా’ మార్గంలో ఒక సానుకూల అడుగుగా మారుతుందని అభివర్ణించారు.