శ్రీశైలం : కొవిడ్ కారణంగా శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి రాలేని వారికోసం దేవస్థానం పరోక్ష సేవా విధానాన్ని అందుబాటులో ఉంచి సేవాకర్తల గోత్రనామాలతో అర్చనలు, హోమాలు, నిత్య కల్యాణంలో భాగ్యస్వామ్యం కల్పిస్తున్నది.
అదేవిధంగా స్వామిఅమ్మవార్లకు కానుకలు సమర్పించేందుకు ఈ హుండీని(srisailadevasthanam.org) ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఉద్యానవనాల్లో ప్రాణవాయువునిచ్చే మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
శనివారం క్షేత్ర పరిధిలోని ఉద్యానవనాలు, వలయ రహదారిని ఆయన పరిశీలించి మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, భక్తులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ముందస్తు ప్రణాళికగా మొక్కలు నాటాలన్నారు. ఆయన వెంట శ్రీశైలప్రభ సంపాదకుడు అనిల్ కుమార్, ఉద్యానవన విభాగాధిపతి లోకేశ్వర్లు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.