(ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ.. ఉత్తరాది రాష్ర్టాల్లో పార్టీ పట్ల ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బెంబేలెత్తుతున్నది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ర్టాలకు చెందిన దిగువశ్రేణి నాయకులు ఇటీవల న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. తమ పాలనలోని రాష్ర్టాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు, పరిపాలన తీరుపై వారు చర్చించినట్టు సమాచారం. గుజరాత్లో వరుసగా నాలుగుసార్లు, మధ్యప్రదేశ్లో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కమలనాథుల పరిపాలనా తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదని నాయకులు పేర్కొన్నట్టు సమాచారం. తమ పార్టీ ముఖ్యమంత్రులకు నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
పార్టీ అంతర్గత సర్వేల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రుల ప్రజాదరణ ఆధారంగా 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడం అసాధ్యమని తేలినట్టు సమాచారం. దీనికితోడు గత కొన్నేండ్లలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు ఇంతవరకు పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఎటువంటి స్థానం కల్పించలేదు. దీంతో వారు పార్టీ కార్యకలాపాల్లో అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి ఫిరాయించి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియాకు సొంత నియోజకవర్గంలో వస్తున్న స్పందన బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నది.
లోక్సభ ఎన్నికలకు ముందు ఆయా రాష్ర్టాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకుల పోస్టర్లతో కాకుండా ప్రధాని మోదీని చూపించి ఎన్నికల ప్రచారం చేయాలని సమావేశానికి హాజరైన పలువురు అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే ఈ వ్యూహం కూడా పలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదని మరికొందరు ఎత్తిచూపినట్టు సమాచారం. 2019 తరువాత జరిగిన పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో మోదీ మంత్రం పనిచేయలేదని వారు గుర్తుచేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కడం అంత సునాయాసం కాదని దాదాపు బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలందరూ అభిప్రాయపడినట్టు సమాచారం.