పార్లమెంటరీ కమిటీల్లో
హస్తం పార్టీకి తగ్గుతున్న ప్రాధాన్యం
దీనస్థితిలో కాంగ్రెస్
(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి చిక్కులు వస్తూనే ఉన్నాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ఇప్పటికే తలనొప్పిగా మారింది. మరోవైపు, సభ్యుల సంఖ్య తగ్గుతుండటంతో పార్లమెంటరీ కమిటీలు చేజారుతున్నాయి. కమిటీల ఏర్పాటుపై గురువారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి విపక్ష నేతలు హాజరయ్యారు.
శీతాకాల సమావేశాలకు ముందు కొన్ని కీలక శాఖల కమిటీలకు విపక్ష సభ్యులను చైర్మన్లుగా నియమించడం పరిపాటి. ఆయా శాఖలకు 24 కమిటీల దాకా ఉంటాయి. ప్రతి కమిటీలో 31 మంది సభ్యులుంటారు. వారిలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు. వీరిని లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేస్తారు. బీజేపీకి మెజారిటీ ఉంది. దీంతో చిన్నపార్టీలకు విధానపరమైన కమిటీల్లో ప్రవేశం గగనమవుతున్నది. 2019 ఎన్నికల్లో అంతంత మాత్రం సీట్లు రావడమే ఇందుకు కారణం.
నానాటికీ తీసికట్టుగా..
పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్న కాంగ్రెస్ హోంవ్యవహారాల ప్యానెల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు తంటాలు పడుతున్నది. వచ్చే పునర్వ్యవస్థీకరణలో ఆ పదవిని టీఎంసీ నుంచి వేరొకరికి ఇవ్వాల్సి ఉంది. 2019 ఎన్నికల తర్వాత విదేశీ, ఆర్థిక వ్యవహారాల ప్యానెళ్ల చైర్మన్ పదవులు కాంగ్రెస్ చేజారాయి. పార్టీ సభ్యుల సంఖ్యను బట్టి కమిటీ పదవులు ఉంటాయి. విపక్షాల్లో కాంగ్రెస్ కన్నా బిజూ జనతాదళ్, జేడీయూ, టీఎంసీ పరిస్థితే నయంగా ఉంది.
అవి అనేక ప్యానెళ్లలో చోటు సంపాదించుకోగలిగాయి. హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు నాలుగు కీలక శాఖలుగా భావిస్తారు. వీటిలో ఏ ఒక్కదానికీ కాంగ్రెస్ తన సభ్యులను చైర్మన్ను నియమించుకోలేని స్థితికి చేరుకుంది. వాణిజ్యం, రసాయనాలు, ఎరువులు, పర్యావరణ కమిటీలతో ఆ పురాతన పార్టీ సర్దుకోవాల్సి వస్తున్నది. అభిషేక్ సింఘ్వీ హోం ప్యానెల్ చైర్మన్గా వైదొలగక తప్పదని, ఆ స్థానంలో వేరే సభ్యుని నియమించాల్సి ఉంటుందని ప్రభుత్వం కాంగ్రెస్కు తెలియజేసినట్టు సమాచారం. హోంశాఖకు సంబంధించిన కమిటీ దక్కింటుకునేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నది. రాజ్యసభలో కాంగ్రెస్ బలం గత ఐదేండ్లలో 54 నుంచి 31కి పడిపోయింది.