న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇంటింటికీ రేషన్ సరుకులు అందించే సరికొత్త పథకానికి అక్కడి సర్కారు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన పేరుతో ఈ నెల 25న ఈ నూతన పథకాన్ని ప్రారంభించబోతున్నారు. మార్చి 25న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేతుల మీదుగా ఈ కొత్త పథకం ప్రారంభమవుతుందని ఢిల్లీలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి
ఇమ్రాన్ హుస్సేన్ వెల్లడించారు. సీఎం కేజ్రివాల్ తొలిరోజు సీమపురి సర్కిల్ పరిధిలోని 100 కుటుంబాలకు ఇంటి దగ్గరే రేషన్ అందించడం ద్వారా ఈ పథకం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని ఢిల్లీలో మిగతా సర్కిళ్లకు కూడా విస్తరించనున్నట్లు హుస్సేన్ తెలిపారు.