జెనీవా: కరోనా మహమ్మారి ఇప్పట్లో ముగిసిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయన్న ఆపోహలను వీడాలన్నారు. రికార్డు స్థాయిలో యూరోప్ దేశాల్లో కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా.. టెడ్రోస్ మరోసారి వార్నింగ్ జారీ చేశారు. మంగళవారం ఒక్క రోజే ఫ్రాన్స్లో సుమారు 5 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఇక బుధవారం తొలిసారి జర్మనీలో ఏకంగా లక్ష పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒమిక్రాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్తగా సుమారు రెండు కోట్ల పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు డెడ్రోస్ తెలిపారు. ఒమిక్రాన్తో స్వల్ప లక్షణాలే కలుగుతాయన్న తప్పుడు వార్తలతో.. ఆ వేరియంట్ వ్యాప్తి మరింత వేగం పుంజుకున్నట్లు ఆయన చెప్పారు. ఎవరూ తప్పు చేయవద్దు అని, ఒమిక్రాన్ వల్ల హాస్పిటల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఒమిక్రాన్ దూసుకెళ్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని, దాని వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకే వైరస్ను కట్టడి చేయాలని టెడ్రోస్ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ వేగంగా లేని దేశాలు ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. అతివేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీస్ డైరక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.