న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ ఎట్టకేలకు దిగి వచ్చింది. రుణంపై వాహనాలను కొనుగోలు చేసిన వారికి జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) కమిషన్ రీఫండ్ చేస్తామని ప్రకటించింది. అయితే, సదరు ఖాతాదారులు తమ వాహనాల్లో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీని చెల్లింపు విషయమై ఏండ్ల తరబడి చర్చోప చర్చలు జరిగాయి.
ఇంతకుముందు వాహనాల కొనుగోలు దారులకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో అవకతవకలు జరిగాయి. ఈ సంగతి ఇటీవల బ్యాంక్ సీఈవోగా రిటైరైన ఆదిత్య పూరి అంగీకరించారు.
వెహికల్ లోన్ తీసుకున్న వారి వాహనాల్లో జీపీఎస్ వ్యవస్థను బలవంతంగా అమర్చారన్న ఆరోపణలు వచ్చాయి. వాహనదారుల అనుమతి లేకుండానే ఆ వెహికల్స్లో జీపీఎస్ ఏర్పాటు చేసినట్లు అభియోగం.
ఈ విషయమై హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గత నెల 29న రూ.10 కోట్ల జరిమాన విధించింది. దీంతో అసలు సంగతి బయటపడింది. దీంతో సంబంధం ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు రాజీనామా చేశారు.
ఈ సంగతి వెలుగు చూడటంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న వాహనదారులకు దానికి సంబంధించిన కమిషన్ వాపస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దినపత్రికల్లో పబ్లిక్ నోటీసు ప్రచురించింది.
2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఈ బ్యాంకులో వాహన రుణం తీసుకున్న వారికి జీపీఎస్ డివైజ్ కమిషన్ రీఫండ్ చేస్తుంది. వచ్చే 30 రోజుల్లోపు ఖాతాదారులు తమ సమీప బ్యాంకు శాఖల్లో సంప్రదించాలని, వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది.
ఈ జీపీఎస్ వ్యవస్థతో కూడిన డివైజ్ ధర రూ.18 వేలు ఉంటుంది. ఆటో రుణ గ్రహీతలకు.. వారి వెహికల్ లోన్లో జీపీఎస్ సిస్టమ్ను కలిపేసింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్.
బ్యాంకు నుంచి ఏ వస్తువును విక్రయించినా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. జీపీఎస్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం ద్వారా సదరు వాహనదారుడి వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)ని బ్యాంక్ ఉల్లంఘించిందన్న అభియోగం వచ్చింది.
ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న కొంత మంది బ్యాంకు అధికారులను తప్పించారు. మరికొందరు అధికారులు వైదొలిగారు. వారి స్థానే కొంత మంది అధికారులను హెచ్డీఎఫ్సీ బ్యాంకు కొత్తగా నియమించుకుంది.