రాజన్న సిరిసిల్ల: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. ఈ సంఘటన
ఎల్లారెడ్డి పేట మండల పరిధిలోని కేసీఆర్ నగర్లో చోటుచేసుకుంది. కేసీఆర్ నగర్కు చెందిన కుడుముంచ ముద్దుకృష్ణ (30) ఈనెల 2వ తేదీన అదృశ్యమయ్యారు. దీంతో ముద్దుకృష్ణ తల్లిదండ్రులు పాపయ్య, సువర్ణ.. స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు.
ఈ క్రమంలో తమ కొడుకు కనిపించడం లేదని శుక్రవారం ఉదయం ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే శనివారం ఉదయం కేసీఆర్ నగర్ పరిధిలోని చెరువులో ముద్దుకృష్ణ శవమై తేలాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.