హైదరాబాద్ : జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్లో దారుణం జరిగింది. నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా.. భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి శరీరం రెండు ముక్కలైంది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే రాంవిలాస్ అనే వ్యక్తి ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అక్రమంగా నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. అయితే ఇవాళ ఉదయం గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో లీకేజీ వల్ల భారీ పేలుడు సంభవించింది. దీంతో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న ముకుంద్(28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ సెంటర్లో పని చేస్తున్న మరో ఇద్దరు కుమార్(25), విజయ్(25) కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూరారంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో విజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు రాంవిలాస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, రాంవిలాస్ ఆచూకీ కోసం వెతుకుతున్నామని చెప్పారు. దాదాపు గత రెండేండ్ల నుంచి ఈ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.