అమరావతి : శ్రావణ మాసం కదా.. ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్లు అని అత్త ఆప్యాయ పలుకరింపు. కోడలు కూడా కరిగిపోయింది. అత్త పిలిచిందే ఆలస్యం.. ఆమె ఇంట్లో కోడలు వాలిపోయింది. అప్పటికే పథకం పన్నిన అత్త.. కోడలిని అతికిరాతకంగా చంపేసింది. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసింది. ఏ మాత్రం భయపడకుండా.. కోడలి తలతో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటు చేసుకుంది.
రాయచోటి పట్టణంలోని కే రామపురానికి చెందిన సుబ్బమ్మ.. తన సొంత అక్క కోడలు వసుంధర(35)ను తన ఇంటికి రావాలని, భోజనం చేసి వెళ్లాలని కోరింది. అయితే వసుంధరను చంపాలని సుబ్బమ్మ ముందే ప్లాన్ చేసింది. ఇందుకు బంధువుల సహకారం కూడా కోరింది. ఇక ఇంటికి చేరుకున్న వసుంధరపై పథకం ప్రకారం.. తన సమీప బంధువుల సహాయంతో సుబ్బమ్మ దాడి చేసి చంపేసింది. అనంతరం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి పోలీసు స్టేషన్కు కోడలి తలను తీసుకెళ్లి లొంగిపోయింది. అయితే కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల వల్లే సుబ్బమ్మ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వసుంధర మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.