రామగిరి, జూలై 20 : ‘సాహిత్యం అనేది అద్భుతమైన కళ. అది చిన్ననాటి నుంచే అందిపుచ్చుకోవాల్సిన అధ్యయనంతో కూడిన నైపుణ్యం. నాన్న వీరబ్రహ్మం చేసిన వృత్తి కళా నైపుణ్యాల అనుక్రమణ నుంచే నాలో రచన ఆలోచన ఉద్భవించింది. చదువుతోపాటు చిగురించిన రచనే నేటి గుర్తింపునకు దర్పణమైంది. ఉదోగ్య నేపథ్యంలో నల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా పని చేస్తున్న క్రమంలో నా రచనలు సాహిత్య మార్గం వైపు తీసుకెళ్లాయి’ అని ప్రముఖ కవి, రచయిత, సాహితీ విమర్శకులు వేణుసంకోజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే శ్రీ దాశరథి అవార్డుకు ఎంపికైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు మాటల్లోనే..
నమస్తే తెలంగాణ : మీ సాహితీ ప్రస్థానం?
వేణు సంకోజు : మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న క్రమంలో 1982లో ‘మనిషిగా పూచే మట్టి’ అనే పుస్తకం రాశా. దానిని కాళోజీ ముఖ్య అతిథిగా వచ్చి ఆవిష్కరించారు. ఆ తర్వాత రెండో పుస్తకం మనం, మూడోసారి ‘నేలకల’, ప్రాణప్రదమైన’ అనే రెండు పుస్తకాలు రాశాను. వాటితోపాటు స్పర్శ.. ఇలా 11 పుస్తకాలు రాసి ఆవిష్కరించాను. సుద్దాల హనుమంతు పేరుతో రాసిన పుస్తకాలను కేంద్ర సాహిత్య అకాడమీ ఆంగ్లంలో, తెలుగు అకాడమీ తెలుగులో ప్రచురించాయి. ఇవి ఎంతో పేరు తెచ్చాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పలు సాహిత్య అంశాలు, రచనలతో ప్రొఫెసర్ జయశంకర్ సర్, కేసీఆర్ వంటి మహోన్నత వ్యక్తులతో ముందుకు సాగి సభలు, సమావేశాల్లో పాల్గొన్నాను. దాంతో వేణుసంకోజు పరిచయం పెరుగడంతోపాటు సాహిత్య అభిమానులు పెరిగారు.
నమస్తే తెలంగాణ : సాహిత్య రంగంలో మీ సేవల గురించి
వేణు సంకోజు : సాహిత్య రంగంలో ఇప్పటి వరకు ఎన్నో అంశాల్లో సేవలందించాను. ముఖ్యంగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎంతో ప్రాధాన్యం కల్పించారు. 1982 నుంచి నేటి వరకు చేస్తున్న రచన, సాహిత్య అంశాలను ఎంతోమంది విద్యార్థులు ఎంఫిల్, పీహెచ్డీలో సైతం ఉపయోగించారు.
నమస్తే తెలంగాణ : సాహిత్యం విషయంలో నాటి-నేటి ప్రభుత్వాల్లో తేడా?
వేణు సంకోజు : ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎంతోమంది గొప్ప రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఉన్నారు. అప్పట్లో గుర్తింపు కంటే స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైంది. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులకు గుర్తింపు ఇస్తూ గౌరవిస్తున్నారు. ఇది చాలా హర్షించదగిన విషయం. ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతా క్రమంలో తెలుగు అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ వంటి సంస్థలను స్థిరీకరణ చేసి మరింత మందిని వెలుగులోకి తేచ్చి నేటి తరంలో రచణా నైపుణ్యాలు పెంచాలి.
నమస్తే తెలంగాణ : శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఎంపికపై?
వేణు సంకోజు : ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన నాటి తరం తెలంగాణ గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్య. అంతటి మహోన్నత వ్యక్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా అవార్డును అందించడం నేటి తరానికి స్ఫూర్తినీయం. 2022లో నాకు అవకాశం కల్పించడాన్ని హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇంతటి సత్కారం కంటే గొప్పది ఉండదని భావిస్తున్నా. నా సాహిత్య అంశాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు భాగస్వామ్యమైన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా సాహిత్య కృషిలో నా భార్య విజయ సహకారం కూడా ఎంతో ఉంది.
నమస్తే తెలంగాణ : నేటి తరం యువతకు మీ సందేశం ?
వేణు సంకోజు : పుస్తకాలు రాయాలంటే మొదట చూడడంతోనే అధ్యయనం ప్రారంభమవుతుంది. చూడడం అంటేనే నేర్చుకోవడం అనేది నేను ప్రగాఢంగా భావిస్తాను. నేటి తరం యువత సాహిత్యలో రాణించాలంటే ఇష్టంతో శ్రమించడం అలవర్చుకోవాలి. దాంతో అధ్యయన నైపుణ్యం పెరుగుతుంది. ఆకాశమే హద్దుగా ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. చూసిన అంశాలను పద్ధతి ప్రకారం లయయుతంగా రాస్తే అది రచన అవుతుంది. ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుంది. దానికి పదునుపెట్టి వెలుగులోకి తేవడం ద్వారా రచనలు, సాహిత్యాన్ని బతికించుకోవాలి