చెడుపై మంచి గెలిచిన రోజుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకొంటారు. తెలుగు పండుగల్లో ప్రధానమైన దసరా ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఊరూరా శమీ వృక్షాల వద్ద పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఒకరికొకరు శమీ పత్రాలు ఇచ్చిపుచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ రోజు పాలపిట్ట దర్శనం శుభమని ప్రజల నమ్మకం. ఇప్పటికే మార్కెట్లు కోలాహలంగా మారాయి.. ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
వనపర్తి, అక్టోబర్ 4: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా అమ్మవారిని పూజించి పదో రోజు విజయదశమి (దసరా) పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఉమ్మడి జిల్లావ్యాపంగా బుధవారం దసరా పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించనున్నారు. చెడుపై మంచి సాధించిన విజయ సంకేతమే విజయదశమి. శక్తిస్వరూపం, మహాశక్తి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే ప్రతి కార్యం విజయ శిఖరాలను చేరుకుంటుందని భక్తుల నమ్మకం. శ్రీరాముడు అమ్మవారిని పూజించి రావణ సంహారం చేసి విజయం సాధించాడని, అందుకే విజయదశమి రోజున రావణాసురుడి ప్రతిమలను దహనం చేస్తారు.
విజయదశమి రోజున ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభప్రదంగా ఉంటుందని, దుకాణాలు, వ్యాపారాలు, ప్రారంభిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుందని ప్రజల నమ్మకం. పాత యంత్రాలు, వాహనాలను సైతం శుభ్రపర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో పాలపిట్టను దర్శించుకుంటే సకలపాపాలు తొలిగిపోతాయని ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా గ్రామానికి సమీపంలోని జమ్మిచెట్టుకు పూజలు చేసి ఆకులను బంగారంలా భావించి పెద్దల ఆశ్వీరాదాలు తీసుకుంటారు. దసరా పండుగ సందర్భంగా వనపర్తికి విశిష్టత ఉంది. రాజుల కాలంలో వినియోగించిన ఆయుధాలకు పూజలు చేయడం వనపర్తి రాజవంశస్థుల ఆనవాయితీ.