శ్రీశైలం : శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి సింహ మండపం వద్ద బ్రహ్మచారిణీగా దర్శనమిచ్చిన భ్రమరాంబ అమ్మవారికి అర్చనలు చేసినానంతరం అలంకార మండపంలో మయూర వాహనంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు షోడశోపచార క్రతువులు నిర్వహించి ప్రాకారోత్సవం జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవం తరువాత కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ ఆదిదంపతులకు ఆస్థానసేవ జరిపించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాకారోత్సవంలో కళాకారుల విన్యాసాలు నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. శరన్నవరాత్రుల్లో మూడో రోజు శనివారం సాయంత్రం అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమివ్వగా స్వామివారు రావణ వాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈఓ లవన్న తెలిపారు.