Dasara Celebrations | శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని రోజుకో అలంకారంలో పూజిస్తారు. వీటిలో సరస్వతీదేవి అవతారం ప్రత్యేకమైనది. నవరాత్రుల్లో మూలా నక్షత్రం పరివ్యాప్తమై ఉన్న రోజు ముగ్గురమ్మల మూలపుటమ్మను వీణాపాణిగా ముస్తాబుచేస్తారు. ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ’ అని ఆరాధిస్తారు. విజ్ఞాన దేవతగా, వివేకధాత్రిగా బ్రహ్మ నాలుకపై నర్తించే చదువుల తల్లి మన రాష్ట్రంలోని వివిధ క్షేత్రాల్లో కల్పవల్లిగా వెలసింది. ఆ చల్లని తల్లి ఒడిలో అక్షరాలు దిద్దిన బాలలు.. విద్యాధికులై విజయం సాధించారు.
నిర్మల్ జిల్లాలోని బాసర ప్రఖ్యాత సరస్వతీ క్షేత్రం. నిండుగా ప్రవహించే గోదావరి నది ఒడ్డున మెండుగా దీవెనలు కురిపిస్తూ వీణాపాణి ఇక్కడ కొలువుదీరింది. పట్టు పుట్టం చుట్టుకొని, దిట్టంగా పసుపు అద్దుకొని చల్లని వెన్నెల్లాంటి నవ్వులు కురిపిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది జ్ఞాన సరస్వతి. అష్టాదశ పురాణాలను రచించిన వేదవ్యాసుడు ప్రతిష్ఠించిన విగ్రహం మూలమూర్తిగా పూజలు అందుకుంటున్నది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మనోవ్యాకులతకు గురైన వ్యాసుడు గోదావరి తీరంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై లక్ష్మీ, సరస్వతి, పార్వతి మూర్తులను అక్కడ ప్రతిష్ఠించాల్సిందిగా ఆదేశించింది. వ్యాసుడు గోదావరి నది నుంచి మూడు గుప్పిళ్ల ఇసుక తెచ్చి లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి విగ్రహాలను రూపొందించి ప్రతిష్ఠించాడని స్థల పురాణం. ఇసుకతో తీర్చిదిద్దిన భారతి విగ్రహానికి పసుపు పూసి పూజలు నిర్వహిస్తారు. వ్యాసుడు తపస్సు చేసిన ప్రదేశం కావడంతో ఈ క్షేత్రం పేరు వ్యాసపురిగా, వాసరగా కాలక్రమంలో బాసరగా స్థిరపడింది. ఆలయ సమీపంలోనే లక్ష్మీదేవి, పార్వతీదేవి ఆలయాలు ఉన్నాయి. వసంత పంచమి, శరన్నవరాత్రులు వంటి ప్రత్యేక సందర్భాల్లో వేలాదిగా భక్తులు సరస్వతిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక సాధకులు ఇక్కడ 21 రోజులు, 41 రోజుల దీక్ష చేపడతారు. పట్టణంలో ఎంపిక చేసిన ఇండ్లకు వెళ్లి భిక్షాటన చేసి, దాన్నే ఆహారంగా తీసుకుంటారు. దీనికి మధుకరం అని పేరు.
విద్యాబుద్ధులు ప్రసాదించే సరస్వతీదేవి అంతటా ప్రసన్న వదనంతో, కమలంపై ప్రశాంతంగా కూర్చొని దర్శనమిస్తుంటుంది. కానీ, అనంతసాగర్ క్షేత్రంలో అందుకు భిన్నంగా నిల్చున్న వీణాపాణిగా కొలువుదీరింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్నది. ఆలయ పరిసరాలు ప్రకృతి రమణీయతతో అలరారుతుంటాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన దోనెలు పుణ్య తీర్థాలుగా ప్రాచుర్యం పొందాయి. ఇదే ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని అష్టకాల నరసింహరామశర్మ సరస్వతి ఆలయాన్ని నిర్మింపజేశారు. 1980లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, 1990లో ప్రతిష్ఠ జరిగింది. సరస్వతిదేవి నిలబడి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. చదువులతల్లి ఆలయ ప్రాంగణంలోనే సౌభాగ్యలక్ష్మి, మహంకాళి అమ్మవారి గుళ్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో శనిగరం దగ్గర దిగితే, అక్కడినుంచి రోడ్డు మార్గంలో (2 కి.మీ.) అనంతసాగర్ చేరుకోవచ్చు.
సిద్దిపేట జిల్లా వర్గల్ క్షేత్రం విద్యా సరస్వతి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ మహానగరానికి సమీపంలో (సుమారు 41 కి.మీ.) ఉండటంతో ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువే! బాసర క్షేత్రానికి వెళ్లలేని వారు వర్గల్ అమ్మవారిని దర్శించుకొని తృప్తి చెందుతారు. ఇక్కడ కూడా నిత్యం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. 1992లో ఆలయ ప్రతిష్ఠ జరిగింది. కంచి మఠం ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతున్నది. ఈ క్షేత్రంలో అమ్మవారి ఆలయంతోపాటు శనైశ్చరుడు, సాంబశివుడు, సుబ్రహ్మణ్య, వేంకటేశ్వర ఆలయాలు ఉన్నాయి. వేద పాఠశాల కూడా నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రం సమీపంలో పేరూరు దగ్గర మంజీరా తీరంలోనూ సరస్వతి ఆలయం ఉంది.
హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పచ్చటి ప్రకృతితో విద్యారణ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ చదువుల ప్రాంగణంలో కొలువుదీరింది సరస్వతీ దేవి. ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉన్న శారదాదేవి ఆలయానికి రోజూ వందలమంది విద్యార్థులు వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో కూర్చుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. స్వయంకృషికి అమ్మవారి అనుగ్రహం కూడా తోడవుతుందని నమ్ముతారు. సికింద్రాబాద్ సమీపంలోని ముషీరాబాద్లోనూ దశాబ్దాల చరిత్ర ఉన్న సరస్వతీదేవి ఆలయం కనిపిస్తుంది. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని 1950లో నిర్మించారు. ఆనాటి నుంచీ భక్తులపాలిట కొంగుబంగారమై పూజలు అందుకుంటున్నది శారదాంబ.
“దసరాకు ఏ రాష్ట్రం ఎన్ని రోజులు సెలవులు ఇస్తుందో తెలుసా!!”
ముంబై, కోల్కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
dussehra | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో వస్త్రంలో ఎందుకు దర్శించుకోవాలి?