హైదరాబాద్ : బిహార్ దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. సెంట్రల్ ఏజెన్సీ, నగర పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు నిందితున్ని సీపీ మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆటో డ్రైవర్ అజి అలీ హత్య కేసులో అతని స్నేహితుడే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. స్నేహితులివురి మధ్య మనస్పర్థ కారణంగా గొడవ జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే అజి అలీని అతని స్నేహితుడు మహమ్మద్ ఇర్ఫాన్ హత్య చేశాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. మరో వైపు నకిలీ విత్తనాలు, డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.