వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్ చివరిది కాదని, కరోనా అంతంపై అప్పుడే ఊహలు చేయడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. మరిన్ని కరోనా వేరియంట్లు ఉద్భవించడానికి ప్రపంచ పరిస్థితులు అనువుగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనా ముగింపు గేమ్లో ఉన్నామని భావించడం సరికాదన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో టెడ్రోస్ సోమవారం కీలక ప్రకటనలు చేశారు. ప్రపంచ దేశాలు తమ వ్యూహాలు, సాధనాలను సమగ్రంగా ఉపయోగిస్తే, “మహమ్మారి తీవ్రమైన దశ” ఈ సంవత్సరంలోనే ముగియవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే దీనిని సాధించడానికి దేశాలు తమ జనాభాలో కనీసం 70 శాతం మందికి టీకాలు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని టెడ్రోస్ సూచించారు. ప్రధానంగా వృద్ధులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు , కరోనా బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉన్న వ్యక్తులు, అధిక ప్రాధాన్యత గల సమూహాలపై దృష్టి సారించాలని అన్నారు.
అలాగే అన్ని దేశాలు కోవిడ్ -19 పరీక్షలను పెంచాలని, భవిష్యత్తులో మరిన్ని వేరియంట్ల కోసం సన్నద్ధంగా ఉండాలని టెడ్రోస్ తెలిపారు. కరోనా సంబంధిత సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని, సంక్షోభం ముగిసే వరకు వేచి ఉండకూడదని అన్నారు. “ఈ మహమ్మారి తీవ్ర దశను అంతం చేయడానికి మనం కలిసి పని చేయాలి. భయాందోళనలు, నిర్లక్ష్యం మధ్య సాగిపోవడాన్ని మనం ఇంకా కొనసాగించలేం ” అని వ్యాఖ్యానించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం 150వ సెషన్లో టెడ్రోస్ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. కాగా, వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో, గ్లోబల్ హెల్త్ ఏజెన్సీకి చెందిన అనేక కీలక అంశాలు, డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ సెకండ్ టెర్మ్, డబ్ల్యూహెచ్వోను మరింత ఆర్థిక స్వతంత్రంగా మార్చే ప్రతిపాదనతో సహా అనేక విషయాలను చర్చిస్తారని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.