నిజాంసాగర్, సెప్టెంబర్ 27: సీఎం కేసీఆర్తోనే దేశమంతా దళితబంధు సాధ్యమవుతుందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తమకు దళితబంధు కావాలని ఇతర రాష్ర్టాల్లోని దళితులు ప్రధాని మోదీని నిలదీస్తున్నారని గుర్తుచేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను అందజేశారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా దళితులు ఇంకా దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. దళితుల జీవితాల్ల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకొని ముందు కు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 17 లక్షల ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి దళితబంధును అమలుచేస్తున్నారని స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్లకు తగిన గుణపాఠం చెప్పే రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
దళితబంధుకు గోకుడు, గీకుడు లేదు : మంత్రి వేముల
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుకు గోకుడు లేదు గీకుడు లేదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గతంలో రూ.లక్ష రుణం కోసం బ్యాంకుకు వెళ్తే దళారుల బాధ, కమీషన్లు, సవాలక్ష కొర్రీలు ఉండేవని అన్నారు. కానీ, దళితబంధు పథకంతో లబ్ధిదారుడికి ఇష్టం వచ్చిన యూనిట్ కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు అందజేస్తున్నదని చెప్పారు. తెలంగాణ పథకాల కోసం ఇతర రాష్ర్టాలవారు మోదీని నిలదీస్తున్నారని అన్నారు. నిజాంసాగర్ మండలాన్ని సీఎం కేసీఆర్ దళితబంధు పైలట్ మండలంగా ప్రకటించి 1,298 దళిత కుటుంబాలను గుర్తించారు. వారిలో కొంత మందికి రెండు నెలల కిందటే యూనిట్లను అందజేశారు. మిగిలిన 140 మందికి మంగళవారం మంత్రులు యూనిట్లను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు తదితరులు పాల్గొన్నారు.