హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలును ఆపేసిన కుట్ర బీజేపీదే అని తేలిపోయింది. ఈ పథకంపై ఈటల రాజేందర్ అక్కసు బట్టబయలైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి ఈ నెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఈ పథకాన్ని ఆపేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేంద్రం అదే రోజు స్పందించి వెంటనే నివేదిక తెప్పించుకున్నది. ఆ తర్వాత ఎప్పటినుంచో అమలవుతున్న ప్రాజెక్టును నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.
7-10-2021.. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రేమేందర్రెడ్డి లేఖ
దళితబంధును నిలిపివేయాలని పరోక్షంగా సూచిస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆ లేఖలో ‘దళితబంధు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. ఎన్నికలకు నాలుగైదు రోజుల ముందు విడుదల చేసి ప్రభావితం చేసేందకు ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
7-10-2021.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరిన ఈసీ
ప్రేమేందర్రెడ్డి లేఖపై ఈసీ అదేరోజు (7వ తేదీన) స్పందించింది. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలపై 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు వివరణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీచేసింది. దళితబంధు ఆన్గోయింగ్ ప్రాజెక్టేనని కలెక్టర్ నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
8-10-2021.. వివరణ పంపిన రాష్ట్ర ఎన్నికల సంఘం
కేంద్రం ఆదేశాల మేరకు దళితబంధు అమలవుతున్న తీరు, అధికారుల బదిలీ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ పంపింది.
18-10-2021.. దళితబంధును నిలిపివేస్తూ ఉత్తర్వులు
దళితబంధు పథకాన్ని ఎన్నికలు పూర్తయ్యేంతవరకు నిలిపివేయాలని ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై 19న మధ్యాహ్నం 2 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అమలు చేయమన్నారా? ఆపేయమన్నారా?
వాస్తవానికి దళితబంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే అమల్లోకి వచ్చింది. ప్రేమేందర్రెడ్డి ఈసీకి లేఖ రాసేనాటికే నియోజకవర్గంలో ప్రభుత్వం మొత్తం 20,969 మంది లబ్ధిదారులను గుర్తించి, వారిలో 16,969 మంది ఖాతాల్లో రూ.10 లక్షలు జమచేసింది. వారిలో వందమందికిపైగా ఆ నిధులతో స్వయం ఉపాధి బాట పట్టారు. ట్రాక్టర్లు, కార్లు వంటి వాహనాలు, పాడిపశువులు, లేత్ మిషన్.. ఇలా పలు రకాల యూనిట్లు కొనుగోలు చేశారు. అయినా దళితబంధు నిధులు విడుదల ఆపారని అబద్ధాలు చెప్పి బీజేపీ నేతలు పరోక్షంగా ‘దళితబంధును అడ్డుకోండి’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ లేఖలో ‘వెంటనే దళితబంధు నిధులు విడుదల చేయించండి’ అని కోరాల్సింది. కానీ ఎక్కడా ఆ పదం వాడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం అప్పటికే కొనసాగుతున్న పథకాలను ఆపే హక్కు లేదు. దీనిని బట్టే బీజేపీ దళిత బంధుపై అక్కసుతో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకున్న విషయం స్పష్టమవుతున్నదని పథకం లబ్ధిదారులు మండిపడుతున్నారు.