నల్లగొండ : దళిత బంధు పథకం ఓ సామాజిక విప్లవంగా భావించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో 96 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
స్వాతంత్రానికి ముందు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. స్వాతంత్రం వచ్చి ఇన్నేండ్లు గడిచినా కుల విక్షత పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులను సామాజికంగా, ఆర్థికంగా బలేపేతం చేసి ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధి సమన్వయంతో అర్హులకు దళిత బంధు యూనిట్లను అందజేయాలన్నారు. దళిత బంధు పథకం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.