హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇది దేశానికే దిక్సూచిగా మారుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన దళితబంధు పథకంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఇంట్లో సంక్షేమం.. ప్రతి కంట్లో సంతో షం ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. దళితులకు మట్టి నుంచి బంగారం తీసే శక్తి ఉన్నదని, కానీ వాళ్ల దగ్గర డబ్బులు లేవని గుర్తించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు.దళితబంధును సింగిల్ స్కీమ్గా కాకుండా బహుళ ప్రయోజనాలు ఇచ్చే పథకంగా చూడాలని చెప్పారు. ఈ పథకంలో రీపేమెంట్ లేదని, మధ్యవర్తి లేడని, ఇష్టమున్న వ్యాపారం చేసుకోవచ్చని స్పష్టంచేశారు. దళితులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం దోహదపడుతుందని వివరించారు. దళితబంధు తీసుకునేటోళ్లకు రైతుబంధు, రైతుబీమా కట్ అవుతాయని కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు.
దేశ దళితులంతా కోరుకుంటారు
దళితబంధుపై ఎమ్మెల్యే ఆనంద్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బలపరిచారు. దళితుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఎన్నో ఏండ్లు పరిశీలించిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి ఉద్భవించిన పథకమే దళితబంధు అని పేర్కొన్నారు. కేసీఆర్ 1985లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళితులు ఎదగాలనే సంకల్పంతో దళిత చైతన్యజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశంలోని దళితులందరూ తమకు ఇలాంటి పథకం కావాలని ముక్తకంఠంతో కోరుకునే రోజులొస్తాయని అన్నారు.