వినూత్న వ్యాపారం ఎంచుకున్న బూజునూరుకు చెందిన లబ్ధిదారు
జమ్మికుంటలో అన్ని హంగులతో బేకరీ, స్వీట్షాపు ఏర్పాటు
తనతో పాటు బరో 8 మందికి పని
ఇన్నాళ్లూ దగాపడ్డ దళితుల బతుకుచిత్రాన్ని దళితబంధు మార్చివేస్తున్నది. వారి ఆర్థిక స్థితిగతులను మార్చడంతో పాటు మరో పది మందికి దారి చూపుతున్నది. ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన బైరిమల్ల విజయ-సారయ్య జీవితమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. తనకు అనుభవమున్న వ్యాపారంలో మరో ముందడుగు వేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న లబ్ధిదారు విజయగాథ ఇది.
జమ్మికుంట, జూలై 4 : ఇల్లందకుంట మండలం బూజునూరుకు చెందిన బైరిమల్ల విజయ-సారయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు. పెద్ద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. సారయ్య చేతికొచ్చిన కొడుకు అనిల్తో కలిసి గతంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో చిన్నపాటి బేకరీ, స్వీట్ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల భార్య విజయ దళితబంధు కింద లబ్ధిదారుగా ఎంపికైంది. రూ.10 లక్షలు బ్యాంకులో పడ్డాయి. ఇంతకుముందు తెలిసిన వ్యాపారమైన బేకరీ, స్వీట్ షాపునే యూనిట్గా ఎంచుకున్నది.
కొండూరు కాంప్లెక్స్లో మంచి సెంటర్లో షెట్టర్లు కిరాయికి తీసుకున్నది. అద్దె ఎక్కువైనా ఏసీ(మోడల్) బేకరీగా ఏర్పాటు చేసింది. పెద్దమొత్తంలో సామగ్రిని కొనుగోలు చేసింది. బర్త్డే కేక్స్, బ్రెడ్, పఫ్, పిజ్జా, బర్గర్లు, బిస్కట్స్, రకరకాల స్వీట్లు తయారు చేస్తూ ఫ్రెష్గా అమ్ముతున్నారు. గతంలో తమకు ఉపాధి దొరకడమే గగనమైన చోట మరో ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.