దళితబంధు పథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని యావత్ దళిత సోదరులు నిలదీస్తున్నారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. లేదంటే సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చి దళితబంధు తెచ్చుకుంటామని అంటున్నారని తెలిపారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు మంగళవారం యూనిట్లు పంపిణీ చేశారు.
నిజాంసాగర్, సెప్టెంబర్27: దళితబంధు పథకం దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీని దళిత సోదరులు నిలదీస్తున్నారని, లేదంటే సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చి దళితబంధు తెచ్చుకుంటామని అంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు మంగళవారం యూనిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో హాజరైన కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా దళితులు ఇంకా దుర్భర జీవితం గడుపుతున్నారని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు. దళితుల కండ్లల్లో ఆనందం చూడాలన్న ఆకాంక్షతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. గతంలో ఈ పథకం గురించి మాట్లాడిన వారి ముఖాలు నేడు నల్లబడ్డాయని అన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో గతంలో నీరు లేక ఎండిపోయే రోజుల్ని చూశామని, అలాంటిది తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సాగు నీటి రంగంలో చాలా మార్పు తీసుకువచ్చారని అన్నారు. మన రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో జరగడం లేదని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే మాకూ ఈ పథకాలు అమలవుతాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
పారదర్శకంగా దళితబంధు..
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం పారదర్శకంగా కొనసాగుతున్నదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గతంలో లక్ష రూపాయల రుణం కావాలని బ్యాంకుకు వెళ్తే దళారుల బాధ, వాడికీ వీడికీ డబ్బులు ఇవ్వాలంటూ సవాలక్ష కొర్రీలు ఉండేవన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి గోకుడు గీకుడు లేకుండా లబ్ధిదారుడికి ఇష్టం వచ్చిన యూనిట్ కోసం రూ.పది లక్షలు అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని పార్టీల నేతలు వాగుడే తప్ప చేసేదేమీ లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నివర్గాల ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయనోడు ఒకడు.. కేంద్రంలో ఉన్నోడు ఏం చేస్తలేడు కానీ వాగుడు మాత్రం వాగుతున్నారు. ఒర్రే వాళ్లగురించి సీఎం కేసీఆర్ ఏమన్నారో ఒక్కసారి వినండి అంటూ మంత్రి తన సెల్ఫోన్ను మైక్ దగ్గర పెట్టి వినిపించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు మాకూ అమలు చేయాలని ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రధాని మోదీని నిలదీస్తున్నారన్నారు. మీరు అమలు చేస్తారా.. లేక కేసీఆర్ను ఢిల్లీకి తీసుకురావాలా అంటూ ప్రశ్నిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీ బీబీపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీపీ జ్యోతీదుర్గారెడ్డి, పిట్లం జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తలెత్తుకునేలా చేశారు..
సీఎం కేసీఆర్ సారు మమ్మల్ని తలెత్తుకునేలా చేశారు. దళితబంధు పథకం కింద వరి కోత యంత్రాన్ని కొనుగోలు చేసుకున్నాం. నెల రోజుల్లోనే సుమారు రెండు లక్షల వరకు సంపాదించుకున్నాం. ఇదంతా కేసీఆర్ సారు దయతోనే. దళితులకు ఓ మంచి పథకాన్ని అమలు చేయడంతో నేడు సంఘంలో మాకంటూ గౌరవం లభిస్తుంది. – పాల్ దినకర్, లబ్ధిదారుడు
సీఎంకు రుణపడి ఉంటాం..
దళితబంధు పైలెట్ మండలంగా నిజాంసాగర్ను ప్రకటించినందుకు దళితుల తరఫున సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్ చలువతో రూ.200, రూ.300ల కూలీకి పోయే స్థాయి నుంచి వారే కూలీలను ఏర్పాటు చేసుకునే రోజులు వచ్చాయి. దళిత కుటుంబాలు సమాజంలో దర్జాగా బతికే రోజులు వచ్చాయి. లబ్ధిదారులు తమ యూనిట్ను చక్కగా కొనసాగించి గౌరవంగా బతకాలి. – బీబీపాటిల్, ఎంపీ, జహీరాబాద్
మరిన్ని కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలి
నిజాంసాగర్ను దళితబంధు పైలెట్ మండలముగా గుర్తించినప్పుడు 1298 దళిత కుటుంబాలు ఉన్నట్లు గుర్తించాం. వివిధ ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వెళ్లిన మరో 260 కుటుంబాలు ఉన్నాయి. వారితోపాటు అంగన్వాడీ, వీఆర్ఏలు ఇలా కిందిస్థాయి ఉద్యోగ కుటుంబాలు మరో 160వరకు ఉన్నాయి. వారందరికీ దళితబంధు పథకం అందేలా చూడాలి.
– హన్మంత్షిండే, ఎమ్మెల్యే, జుక్కల్
దేశమంతా కావాలంటే.. కేసీఆర్ రావాలి
దళితబంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నది. దేశంలోని దళితులందరికీ రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. నిజాంసాగర్ మండలం ఒక్కటే కాదు.. దశల వారీగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. దళితబంధు సాధ్యం కాదని చాలా మంది అన్నారు. ఇప్పుడు పథకం విజయవంతం కావడంతో ఆశ్చర్యపోతున్నారు.
– బండ శ్రీనివాస్, చైర్మన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్
లక్ష్మిదేవి ఇంటికి వస్తుంది
సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలతో యూనిట్ను అందజేస్తున్నారు. లబ్ధిదారుల ఇంటికి లక్ష్మిదేవి వస్తున్నది. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు. అందుకే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
– దఫేదార్ శోభారాజు, జడ్పీ చైర్పర్సన్, కామారెడ్డి
పాడి పరిశ్రమకు కేరాఫ్గా మారాలి
దళితబంధు పథకం ద్వారా మండలంలో 381 మంది లబ్ధిదారులు డెయిరీ కోసం బర్రెలు, ఆవులు తీసుకోనున్నారు. మేలు రకం పశువులను కొనుగోలు చేసి పాడి పరిశ్రమకు నిజాంసాగర్ను కేరాఫ్గా మార్చాలి. గొర్రెలు, మేకల్ని కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వాహనంలో లబ్ధిదారులను పంపిస్తాం. ఆరోగ్యంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా యూనిట్ను కొనసాగించుకోవాలి.
– జితేశ్ వీ పాటిల్, కలెక్టర్, కామారెడ్డి
కేసీఆర్తోనే.. దళితులకు సరైన గుర్తింపు
మొన్నటి వరకు నేను ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేసే వాడిని. మా అన్నయ్య కూడా ఇతర పనులు చేసుకునే వాడు. దళితబంధు పథకంతో ఇద్దరం కలిసి రూ.20లక్షలతో నిజాంసాగర్లో స్టీల్, సిమెంట్ దుకాణం ఏర్పాటు చేసుకున్నాం. నెల రోజుల్లో రూ.16లక్షల వ్యాపారం కొనసాగింది. రానున్న రోజుల్లో ఇదే ఆత్మవిశ్వాసంతో మరింత రాణించి సీఎం కేసీఆర్ కలలు కన్న లక్ష్యాన్ని అందుకుంటాం.
– సుదర్శన్, దళితబంధు లబ్ధిదారుడు
ఒక్క నెలలో రూ.50వేలు సంపాదించా..
దళితబంధు పథకంతో కారును అందుకున్నాను. దూర ప్రాంతాలకు అద్దెకు నడుపుతున్నాను. నెలలో 20 రోజులు కిరాయి దొరికింది. ఖర్చులు పోను 50వేల వరకు సంపాదించాను. మొన్నటి వరకు ఇతరుల వద్ద డ్రైవర్గా పనిచేసిన నేను.. ఈ రోజు సొంత బండికి ఓనర్ను అయ్యాననే సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇదంతా సీఎం కేసీఆర్ దయ. – అశోక్, దళితబంధు లబ్ధిదారుడు
అమలు తీరుపై ఆరా..
నిజాంసాగర్, సెప్టెంబర్ 27: దళితబంధు పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ పైలెట్ మండలముగా ప్రకటించిన నిజాంసాగర్లో వందశాతం లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ పూర్తయ్యింది. మొత్తం 1298 దళిత కుటుంబాలను గుర్తించగా రెండు నెలల కిందట మంత్రి ప్రశాంత్రెడ్డి యూనిట్లు అందజేశారు. మిగిలి ఉన్న 140 మంది లబ్ధిదారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్రెడ్డి మంగళవారం అందజేశారు. యూనిట్ల పంపిణీ అనం తరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. దళితబంధు పథకం అమలు తీరుపై చర్చించారు. ఇప్పటి వరకు తీసుకున్న యూనిట్లు కొనసాగుతున్న తీరును ఆరా తీశారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, రాష్ట్ర ప్రత్యేకాధికారి విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.
సభాపతిని కలిసిన మంత్రులు
బీర్కూర్, సెప్టెంబర్ 27: శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాన్సువాడలోని ఆయన స్వగృహంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజాంసాగర్లో జరిగే కార్యక్రమానికి వెళ్తూ బాన్సువాడలోని స్పీకర్ నివాసానికి వచ్చిన మంత్రులకు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి స్వాగతం పలికారు.