అయోధ్య, ఆగస్టు 11: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండాపోయింది. అయోధ్య జిల్లాలో దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లను బంధించి ముగ్గురు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు.
బాధితుల్లో ఒక బాలిక మైనర్. ఈ ఘటన బికాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వారి గ్రామానికి సమీపంలోని షెర్పూర్పురా మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో దుండగులు వారిని అపహరించి దగ్గరలోని చెరుకు పొలాల్లోకి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడి జరిపారు. అనంతరం వారిని విడిచి పెట్టారు. ఇంటికి వెళ్లిన బాధితులు విషయాన్ని మరుసటి రోజు కుటుంబసభ్యులకు తెలిపారు.
లైంగిక దాడి జరిగిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు స్థానిక పోలీసులు నిరాకరించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అయితే సీనియర్ పోలీసు అధికారుల జోక్యంతో చివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భాయిలాల్ యాదవ్, త్రిభువన్ యాదవ్, మరో గుర్తు తెలియని వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.