డెహ్రాడూన్ : కులాంతర వివాహం చేసుకున్న ఓ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంది.
సాల్ట్ నియోజకవర్గం పరిధిలోని పనువదోఖన్ గ్రామానికి చెందిన జగదీశ్ చంద్ర.. ఆగస్టు 21న ప్రేమ వివాహం చేసుకున్నాడు. చంద్ర భార్యది అగ్రకులం. అయితే ఈ పెళ్లిని అమ్మాయి కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తమకు అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ఆగస్టు 27వ తేదీన పోలీసులను కోరినప్పటికీ పట్టించుకోలేదు. అయితే శుక్రవారం రోజు జగదీశ్ చంద్రను భార్య తల్లి, తండ్రి, సోదరుడు ఒంటరిగా పట్టుకున్నారు. అనంతరం అతన్ని హత్య చేశారు. మృతదేహాన్ని కారులో నిర్మానుష్య ప్రదేశానికి తరలిస్తుండగా నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జగదీశ్ చంద్ర సాల్ట్ నియోజకవర్గం నుంచి ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ తరపున అసెంబ్లీకి రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే చంద్ర హత్యను ఆ పార్టీ నాయకుడు పీసీ తివారీ తీవ్రంగా ఖండించారు. చంద్ర భార్యకు రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు ముందే స్పందించి, వారికి భద్రత కల్పించే ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని తివారీ పేర్కొన్నారు.