(నమస్తే తెలంగాణ నెట్వర్క్): ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ విషయంలో దోబూచులాడుతున్న బీజేపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు రగిలాయి. అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో బీజేపీ నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం పినపాక మండలంలో సీఎం కేసీఆర్, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు మాలమహానాడు ఆధ్వర్యంలో క్షీరాభిషేకంచేశారు. జాతి గర్వించదగ్గ అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానించిన కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దళితబంధు కింద మలి విడతలో నియోజకవర్గానికి 1,500 మంది దళితులకు యూనిట్లు అందిస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళిత సంఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు వంటి చారిత్రాత్మక పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. స్థానిక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దళిత సంఘాల నేతలు సంబురాలు నిర్వహించారు.
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మగ్గిడి దిగంబర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళిత సంఘాల నాయకులు బుధవారం పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహంతోపాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి బుధవారం టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా గ్రామాల్లో దళిత సంఘాల నాయకులు అసెంబ్లీ నిర్ణయాన్ని స్వాగతించారు.