Investers Wealth | దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు రూ.4.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు. బీఎస్ఈ సెన్సెక్స్ 638.11 పాయింట్ల నష్టంతో 56,788 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 207 పాయింట్ల పతనంతో 16,887 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోవడానికి పలు కీలక కారణాలు ఉన్నాయి. యూరోపియన్ స్టోక్స్-600 ఇండెక్స్ 1.4 శాతం, లండన్ ఎఫ్టీఎస్ఈ-100 ఒక శాతం నష్టపోయాయి. ఇతర మార్కెట్లు పతనం అయ్యాయి. జపాన్ నిక్కీ మినహా ఆసియా మార్కెట్లన్నీ భారీ నష్టాలతో ముగిశాయి.
ప్రముఖ స్విస్ బ్యాంక్ `క్రెడిట్ సూయిజ్` సంక్షోభం కూడా స్టాక్స్ పతనానికి కారణంగా కనిపిస్తున్నది. స్విస్ బ్యాంక్ జెయింట్ క్రెడిట్ సూయిజ్.. బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్లాన్ను ఈ నెల 27న వెల్లడించనున్నట్లు తెలిపింది. సొంత రుణాల చెల్లింపులో డీఫాల్ట్ కాకుండా చర్యలు తీసుకోనున్నది. ద్రవ్య లభ్యత, పెట్టుబడిపై పెద్ద క్లయింట్లు, ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొల్పేందుకు క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తున్నది. యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో సోమవారం క్రెడిట్ సూయిజ్ షేర్లు 10 శాతం నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర నాలుగు శాతానికి పైగా పెరిగాయి. రోజూ పది లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఒపెక్ + ( OPEC+ ) కూటమి పేర్కొన్న నేపథ్యంలో క్రూడాయిల్ ధర పెరిగింది. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి భారీగా చమురు ఉత్పత్తిలో కోత విధించడం ఇదే తొలిసారి.
ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.81.89 వద్ద (0.67%) పడిపోయింది. ఫలితంగా వస్తువుల ఎగుమతి దారులకు పాజిటివ్ కాగా, దిగుమతులు కాస్ట్లీగా మారతాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి సోమవారం ఒక్కరోజే రూ.1,500 కోట్లకు పైగా విలువ గల స్టాక్స్ విక్రయించారు. గత నెలలో రూ.7624 కోట్ల విలువైన షేర్లు ఎఫ్ఐఐలు విక్రయించారు.