న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. దాని ప్రభావంతో బెంగాల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తుపానుకు ‘గులాబ్’గా పేరుపెట్టారు. శని, ఆదివారాల్లో చురుగ్గా ఉంటుందని, సోమవారం బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 26 నాటికి కళింగపట్నం చుట్టుపక్కల దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఈ క్రమంలో ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గులాబ్ తుపాను కారణంగా బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మంగళవారం నుంచి కోల్కతాలోని హౌరా, దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాతో పాటు తూర్పు మిడ్నాపూర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుపానును ఎదుర్కొనేందుకు కోల్కతా పోలీసులు ‘యూనిఫైడ్ కమాండ్ సెంటర్’ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరో వైపు తీర ప్రాంతాల్లో తుపానును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.