8 వరకు జిల్లాల్లో భారీ వర్షాలు
వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాబోయే 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 8 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.
ఈ మేరకు పలు జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. గత 24 గంటల్లో నాగర్ కర్నూల్, వనపర్తి మినహా అన్ని జిల్లాలో వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. 20కి పైగా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.