సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఈమెయిల్ ఐడీలో ఒక అక్షరం మార్చేసి నగర వ్యాపారి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.46 లక్షలు దోచేశారు. సంతోష్నగర్కు చెందిన వరప్రసాద్ సెన్సార్ కేర్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మెడికల్ పరికరాలు విదేశాల నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తుంటాడు. ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఏజీ సైంటిఫిక్ అనే సంస్థకు ఆర్డర్ ఇస్తుంటాడు. ఆర్డర్లు, డబ్బుల వ్యవహారమంతా ఈ మెయిల్ సంభాషణలో జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్లో వరప్రసాద్ సంస్థ లక్ష డాలర్ల విలువైన వస్తువులకు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్కు సంబంధించి వచ్చిన ఈమెయిల్కు స్పందించాడు. అందులో ఉన్న బ్యాంకు ఖాతాలో 63 వేల డాలర్లు డిపాజిట్ చేశారు. భారత కరెన్సీలో దాని విలువ సుమారు రూ.46 లక్షలు. జనవరి వరకు కూడా తమకు డబ్బులు అందలేదంటూ కాలిఫోర్నియా సంస్థ ఫోన్ చేయడంతో తాము మోసపోయామని హైదరాబాద్ సంస్థ గుర్తించి, సోమవారం పోలీసులను ఆశ్రయించింది.
మోసం ఇలా జరిగింది..
కాలిఫోర్నియా సంస్థ తరుచు ఈమెయిల్ ఐడీలు, బ్యాంకు ఖాతాలను మారుస్తుంది. అదే కంపెనీ పేరుతో ఒక అక్షరం మార్చేసి వరప్రసాద్కు ఈమెయిల్ వచ్చింది. అందులో ఉన్న బ్యాంకు నంబర్ కూడా కొత్తది కావడంతో అనుమానం లేకుండా ఆ డబ్బును పంపించారు. సైబర్నేరగాళ్లు ఈ వ్యాపారుల ఈమెయిల్స్ను హ్యాక్ చేసి, జరుగుతున్న వ్యాపార లావాదేవీలను పరిశీలించారు. ఆమెరికా కంపెనీ పేరుతో అచ్చుగుద్దినట్లు ఒక ఈ మెయిల్ ఐడీని తయారు చేసి అందులో ఒక అక్షరాన్ని తప్పుగా రాశాడు. ఆ ఈ మెయిల్ ద్వారా వరప్రసాద్కు ఈమెయిల్ పంపించాడు. తమకు ఆర్డర్లు పంపించే సంస్థదిలాగనే ఈమెయిల్ ఐడీ ఉందని భావించి, అందులో ఉన్న ఖాతాకు డబ్బు బదిలీ చేశారు. కాలిఫోర్నియా సంస్థ డబ్బు అడగడంతో మోసపోయామని గుర్తించి, సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రుణం ఇస్తామంటూ రూ.18 లక్షలు స్వాహా
శ్రీనగర్ కాలనీకి చెందిన రిటైర్డు ఉద్యోగి కేశవరావుకు తాము కోటి రూపాయల రుణం ఇస్తామంటూ సైబర్నేరగాళ్లు సంప్రదించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు దఫ దఫాలుగా నేరగాళ్లు అడిగినట్లు రూ. 18 లక్షల వరకు ఇస్తూ పోయాడు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో మోసమని గుర్తించి సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నీవు అందంగా ఉన్నావు.. నీకు సినిమా చాన్స్ పక్కా..
ఫేస్బుక్లో సినిమా ఆఫర్కు బోల్తా పడ్డిన ఓ యువకుడు రూ.91 వేలు పోగొట్టుకున్నాడు. బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. భువనగిరికి చెందిన ఓ యువకుడికి ఫేస్బుక్లో సినీ డ్రైవ్ ఇన్ పేజీతో పరిచయమయ్యాడు. అందులో చాటింగ్ చేస్తూ తాను హైదరాబాద్లోని ఓ పేరొందిన ఫిలిం సిటీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నానని నమ్మించాడు. నీవు చాలా అందంగా ఉన్నావు.. నీకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి.. రూ.91 వేలు గూగుల్ పే ద్వారా తీసుకున్నాడు. కానీ ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడంతో పాటు ఇంకా డబ్బులు కావాలని అడుగుతుండటంతో తేరుకున్న యువకుడు వెంటనే సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.