గిరి గీసి బరిలోకి దిగితే.. తన పంచ్కు తిరుగులేదని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి నిరూపించింది. ఇటీవలే ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న ఈ ఇందూరు బాక్సర్.. బరిలోకి దిగిన తొలి కామన్వెల్త్ గేమ్స్లోనే పసిడి పతకంతో మెరిసింది. నిఖత్తో పాటు అమిత్ పంగల్, నీతు స్వర్ణ సౌరభాలు విరజిమ్మగా.. ట్రిపుల్ జంప్లో ఎల్డోస్ పాల్ గోల్డెన్ జంప్ చేశాడు. అబ్దుల్లా రజతం దక్కించుకోగా.. అన్ను రాణి, సందీప్ కుమార్ కంచు మోత మోగించారు. మహిళల హాకీ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకోగా.. టేబుల్ టెన్నిస్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ స్వర్ణంతో మెరిసింది. బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు, లక్ష్యసేన్ ఫైనల్కు దూసుకెళ్లగా.. పారా క్రీడల్లో భవీన పసిడి పతకం పట్టింది. మహిళల క్రికెట్లో మన అమ్మాయిలు రజతం నెగ్గగా.. టీటీలో శరత్ కమల్-సాతియాన్ జోడీ వరుసగా రెండోసారి సిల్వర్ మెడల్తో సంతృప్తి పడింది!
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో తొలుత వెయిట్ లిఫ్టర్లు, ఆ తర్వాత రెజ్లర్లు పతకాల పంట పండిస్తే.. క్రీడలు ముగిసే ముందు మన బాక్సర్లు అదుర్స్ అనిపించారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బరిలోకి దిగిన తొలి మెగాటోర్నీలోనే పసిడి పతకంతో మెరువగా.. అమిత్ పంగల్, నీతు కూడా బంగారు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. మహిళల 50 కేజీల విభాగంలో నిఖత్ 5-0తో కార్లే మెక్ నాల్ (నార్త్ ఐర్లాండ్)పై విజయం సాధించింది. గతేడాది జాతీయ చాంపియన్షిప్ నుంచి బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న నిఖత్.. ఇటీవలే ప్రపంచ చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. అదే జోరు బర్మింగ్హామ్లోనూ కొనసాగించిన ఈ ఇందూరు అమ్మాయి..
అదిరిపోయే పంచ్లతో ప్రత్యర్థిని బెదరగొట్టింది. స్ట్రాంజా మెమొరియల్లో 52 కేజీల ఈవెంట్లో పసిడి నెగ్గిన నిఖత్.. కామన్వెల్త్ కోసం రెండు కేజీలు తగ్గి 50 కిలోల విభాగంలో బరిలోకి దిగింది. బౌట్ ఆరంభం నుంచే చెలరేగిపోయిన నిఖత్.. రింగ్లో ఒకే చోటు నిలబడి పోకుండా అద్భుతమైన ఫుట్వర్క్తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతూ ముష్టిఘాతాలు కురిపించింది. తొలి రౌండ్ ముగిసేలోగానే న్యాయ నిర్ణేతలు ఒక అభిప్రాయానికి వచ్చేయగా.. మిగిలిన రెండు రౌండ్లలోనూ ఈ తెలంగణ యువ కెరటం అదే జోష్ కొనసాగించింది. లెఫ్ట్ హుక్, రైట్ జాబ్ను ఒకేసారి ప్రయోగిస్తూ ప్రత్యర్థిని తికమక పెట్టిన నిఖత్.. బౌట్ ముగియగానే తానే గెలిచాననే సంకేతాలు ఇచ్చింది. కాసేపటికే రిఫరీ నిఖత్ చేయి పైకెత్తగా.. ఆనందంలో ఒక్కసారిగా గాల్లోకి పంచ్లు విసిరిన నిఖత్ తన విజయాన్ని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
16 ఏండ్ల తర్వాత ..
మహిళల హాకీ జట్టుకు కాంస్యం
టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్న భారత మహిళల హాకీ జట్టు.. కామన్వెల్త్లో ఆ అవకాశాన్ని ఒడిసి పట్టింది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2-1తో న్యూజిలాండ్పై గెలుపొందింది. అంపైర్ల తప్పిదం కారణంగా సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్.. హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో సత్తాచాటింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు ఒక్కో గోల్ చేశాయి. 29వ నిమిషంలో భారత్ తరఫున సలీమ ఏకైక గోల్ చేయగా.. చివరి వరకు భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే మ్యాచ్ ముగియడానికి అర నిమిషం ముందు న్యూజిలాండ్ స్కోరు సమం చేసింది. దీంతో షూటౌట్ అనివార్యం కాగా.. భారత్ తరఫున సోనిక, నవ్నీత్ గోల్స్ చేయగా.. ప్రత్యర్థి ప్రయత్నాలను కెప్టెన్, గోల్ కీపర్ సవిత సమర్థవంతంగా అడ్డుకుంది. న్యూజిలాండ్ స్ట్రయికర్లు నాలుగు ప్రయత్నాలు చేయగా.. అందులో ఒకటి మాత్రమే విజయవంతమైంది. దీంతో భారత్ 16 ఏండ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో పతకం పట్టింది.
శరత్-సాతియాన్ జంటకు రజతం
టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్లో భారత్కు రజత పతకం దక్కింది. ఆదివారం జరిగిన ఫైనల్లో శతర్ కమల్-సాతియాన్ జోడీ 11-8, 8-11, 3-11, 11-7, 4-11తో పాల్ డ్రింక్హాల్-లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్) జంట చేతిలో ఓటమి పాలైంది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన ఈ జోడీ.. మరోసారి అదే ఫలితం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు స్థాయిలో 11వ పతకం ఖాతాలో వేసుకున్న శరత్ కమల్.. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో తెలంగాణ ప్యాడ్లర్ ఆకుల శ్రీజతో కలిసి బరిలోకి దిగాల్సి ఉంది.
ట్రిపుల్ జంప్లో డబుల్ ధమాకా
పాల్కు స్వర్ణం, అబ్దుల్లాకు రజతం
కామన్వెల్త్ క్రీడల్లో మన వాళ్లు చరిత్ర తిరగరాస్తున్నారు. అథ్లెటిక్స్లో ఒకటీ అరా పతకాలు సాధించడమే గగనమనుకున్న తరుణంలో మనవాళ్లు.. నయా రికార్డులు నెలకొల్పారు. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో భారత అథ్లెట్లు ఎల్డోస్ పాల్, అబ్దుల్లా అబూబకర్ తొలి రెండు స్థానాల్లో నిలిచి అదుర్స్ అనిపించారు. పాల్ 17.03 మీటర్ల దూరం దూకి పసిడి పతకం ఖాతాలో వేసుకోగా.. అబ్దుల్లా 17.02 మీటర్ల ప్రదర్శనతో రజతం కైవసం చేసుకున్నాడు. బెర్ముడాకు చెందిన జాహ్ పెరిన్చీఫ్ (16.92 మీ) కాంస్యం గెలచుకున్నాడు. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ (16.89 మీ) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
అమిత్, నీతు పసిడి పంచ్
స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ ఎట్టకేలకు కామన్వెల్త్ స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్ పసిడి పంచ్తో మెరిస్తే.. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన తొలి క్రీడల్లోనే నీతు బంగారు పతకం కైవసం చేసుకుంది. గోల్డ్కోస్ట్ (2018) క్రీడల్లో ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న 26 ఏండ్ల అమిత్.. ఆదివారం తుదిపోరులో 5-0తో కైరాన్ మెక్డొనాల్డ్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. జాబ్స్, హుక్స్తో చెలరేగిపోయిన అమిత్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌట్ ముగించాడు. తన ఎత్తును సద్వినియోగ పర్చుకుంటూ కైరాన్ ఆఖరి రౌండ్లో విరుచుకుపడ్డా..
అమిత్ దీటుగా బదులిచ్చాడు. మహిళల విభాగంలో నీతు 5-0తో డెమీ రెస్తాన్ (ఇంగ్లండ్)పై గెలుపొందింది. తొలిసారి కామన్వెల్త్ బరిలోకి దిగి ఫైనల్కు దూసుకెళ్లిన నీతు.. ఏమాత్రం ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పనికానిచ్చింది. 9 నిమిషాల పాటు పూర్తి ఏకాగ్రతతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. బౌట్ అనంతరం కన్నీళ్లు రాల్చుతూ పతకం అందుకున్న నీతు.. తాను ఈ స్థాయికి చేరేందుకు అహర్నిశలు కృషి చేసిన తల్లిదండ్రులకు మెడల్ అంకితమిస్తున్నట్లు పేర్కొంది.
అన్ను రాణికి కాంస్యం
కామన్వెల్త్ గేమ్స్ మహిళల జావెలిన్ త్రోలో పతకం నెగ్గిన తొలి భారత అథ్లెట్గా అన్ను రాణి రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అన్ను జావెలిన్ను 60 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం కైవసం చేసుకుంది. క్లెసీ లీ (64.43 మీ), మెక్నెజీ (64.27 మీ) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు. అన్ను కంటే ముందు బారత్ నుంచి కామన్వెల్త్ పురుషుల విభాగంలో కాశీనాథ్ నాయక్ (2010; కాంస్యం), నీరజ్ చోప్రా (2018; స్వర్ణం) పతకాలు గెలుచుకున్నారు. మరోవైపు పురుషుల 10,000 మీటర్ల రేస్వాక్లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్యం పతకం కొల్లగొట్టాడు.
శ్రీజకు పసిడి
టేబుల్ టెన్నిస్ డబుల్స్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ స్వర్ణం కైవసం చేసుకుంది. సింగిల్స్లో కాంస్యం కోసం చివరి వరకు పోరాడి ఓడిన శ్రీజ.. మిక్స్డ్ డబుల్స్లో పసిడి పతకంతో మెరిసింది. శ్రీజ-శరత్ కమల్ జంట 3-1తో మలేషియా ద్వయంపై విజయం సాధించింది. తొలిసారి బరిలోకి దిగిన కామన్వెల్త్ క్రీడల్లోనే శ్రీజ అద్వితీయ ప్రదర్శన కనబర్చింది.
ఫైనల్లో సింధు, లక్ష్యసేన్
అంచనాలకు అనుగునంగా రాణిస్తూ ముందుకు సాగుతున్న భారత టాప్ షట్లర్ పీవీ సింధు.. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ తుదిపోరుకు అర్హత సాధించగా.. కిడాంబి శ్రీకాంత్ సెమీస్లో ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21-19, 21-17తో యో జియా మిన్ (సింగపూర్)పై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ సెమీస్లో ప్రపంచ 10 ర్యాంకర్ లక్ష్యసేన్ 21-10, 18-21, 21-16తో 87వ ర్యాంకర్ జియా హెంగ్ (సింగపూర్)పై నెగ్గాడు. మరోవైపు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన శ్రీకాంత్ 21-13, 19-21, 10-21తో జే యాంగ్ (మలేషియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 21-6, 21-15తో చెన్ పెంగ్ సూన్-టియాన్ కియాన్ (మలేషియా) ద్వయంపై గెలిచి తుదిపోరుకు చేరింది. శ్రీకాంత్ నేడు కాంస్య పోరు బరిలో దిగనున్నాడు.
పతకం నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. వరుస టోర్నీల కారణంగా ఏడెనిమిది నెలలుగా బయటే ఉన్నా.. ఇక కాస్త విరామం తీసుకొని కుటుంబ సభ్యులతో గడుపాలనుకుంటున్నా. ప్రజలు నా నుంచి ఎక్కువ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్లు దూసుకెళ్లడమే నా కర్తవ్యం.
-నిఖత్ జరీన్