SBI Alert | ఇటీవలి కాలంలో దేశంలో సైబర్ క్రైమ్, డిజిటల్ ఫ్రాడ్ కేసులు అధికం అయ్యాయి. సైబర్ మోసగాళ్లు బహుముఖ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుత పండుగల సీజన్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసులు, డిజిటల్ పేమెంట్స్ సేవలు వాడుతున్న వారు సైబర్ దాడుల ముప్పు నుంచి బయట పడేందుకు జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ పేర్కొంది. పెరిగిపోతున్న సైబర్ క్రైమ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఖాతాదారులు తమ ఖాతాల్లో అసాధారణ లావాదేవీలు జరిగితే తక్షణం తమకు సమాచారం ఇవ్వాలని ఇటీవల ఎస్బీఐ కోరింది. సకాలంలో సమస్య పరిష్కారం కావాలంటే, అనధికారిక లావాదేవీలను తప్పనిసరిగా కస్టమర్లు తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. అందుకోసం 18001-2-3-4 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని, అనధికారిక లావాదేవీలు జరిగితే తగిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.
అనధికారిక లావాదేవీలు జరిగితే తప్పనిసరిగా బ్యాంక్ శాఖలో సమాచారం ఇవ్వాలని గత నెలలో ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖర్రా నొక్కి చెప్పారు. అప్పుడు బాధితుల సొమ్ము తిరిగి పొందడానికి వీలు కలుగుతుందని తెలిపారు. సైబర్ ఫ్రాడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు హితవు చెప్పారు. సైబర్ ఫ్రాడ్ వంటి అంశాల్లో కస్టమర్ సర్వీసులకు బ్యాంకు ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
టోల్ ఫ్రీ నంబర్తోపాటు కస్టమర్లు ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, భీం, ఎస్బీఐ పేమెంట్స్ సర్వీసులపై ఫిర్యాదు చేయొచ్చునని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ అకౌంట్లో ఏదేనీ ఫైనాన్సియల్ ఫ్రాడ్ జరిగి ఉంటే, కస్టమర్ సాధ్యమైనంత త్వరగా బ్యాంకు అధికారుల నోటీసుకు తేవాలని పేర్కొంది. అనధికారిక లావాదేవీలపై ఫిర్యాదు అందగానే తదుపరి అటువంటి మోసపూరిత లావాదేవీలు జరుగకుండా బ్యాంకు తక్షణ చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.
ఏదైనా అనధికారిక లావాదేవీ జరిగిందని ఫిర్యాదు అందితే, ఆ చానెల్లో లావాదేవీలను బ్లాక్ చేస్తామని ఎస్బీఐ పేర్కొంది. కస్టమర్ ఫిర్యాదు చేసిన 90 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని వివరించింది. ఎప్పటికప్పుడు కస్టమర్ రిజిస్టర్డ్ కంప్లయింట్ నంబర్, తదితర వివరాలను ఎస్బీఐ ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్లో తెలియజేస్తుందని పేర్కొంది.