అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థను నాశనం చేసేందుకు వైసీపీ సర్కార్ కంకణం కట్టుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. 117, 128, 84,85 జీవోలతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీరని నష్టంగా మారే అవకాశముందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం విడుదల చేసిన జీవోలు విద్యావ్యవస్థను ప్రమాదంలో పడేసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో నాణ్యమైన విద్యలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా నేడు 19వ స్థానానికి పడిపోవడం బాధకరమని అన్నారు. కొత్త జీవోల వల్ల ఉపాధ్యాయులు 24 నుంచి 30 పీరియడ్లు బదులు వారానికి 40 నుంచి 48 పీరియడ్లు పనిచేయాల్సిన పరిస్థితిని తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరుపై విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అవమానపరిచే విధంగా మాట్లాడారని విమర్శించారు. జీవోలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న ఉపాధ్యాయ సంఘాలకు టీడీపీ మద్దతు తెలియజేస్తోందన్నారు.