న్యూఢిల్లీ: సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సీయూఈటీ పరీక్షలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వీటిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆరు విడతలుగా నిర్వహిస్తున్నది. ఆగస్టు 17 నుంచి 20 వరకు నాలుగో విడత పరీక్ష జరుగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా 3 లక్షల 72 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా కొన్ని పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ విరమించుకున్నది. దీంతో 11 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు దూరమవుతున్నారు.
దీంతో వారందరికి ఈ నెల 30 ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది. వారంతా తమకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం సీయూఈటీ యూజీ పరీక్షలు ఈనెల 28న ముగియాల్సి ఉన్నది. అయితే తాజాగా చివరిదైన ఆరో విడత పరీక్షలను ఆగస్టు 24 నుంచి 30 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది.
ఇప్పటికే రెండో విడత సందర్భంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అదేవిధంగా కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎత్తివేసింది. ఈ కారణంతో పరీక్ష రాయలేకపోయిన వారికి ఈనెల 30 నిర్వహిస్తామని చెప్పింది. వారికి ఆగస్టు 20 తేదీ నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.