న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలోని 38 ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి నియమితులయ్యారు. దీంతో ఈ బాధ్యతలను చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలవనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేండ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ పొందిన శేఖర్ మండే స్థానంలో కలైసెల్వి నియామకం జరిగింది. మండే రిటైర్మెంట్ తర్వాత బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రాజేశ్ గోఖలేకి అదనంగా సీఎస్ఐఆర్ బాధ్యతను అప్పగించారు.
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా అంబసముద్రం పట్టణానికి చెందిన కలైసెల్వి లిథియం అయాన్ బ్యాటరీల రంగానికి ఎనలేని సేవలు అందించారు. సీఎస్ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఈసీఆర్ఐ)లో ఎంట్రీ-లెవెల్ శాస్త్రవేత్తగా పరిశోధనా రంగంలో కెరీర్ను ప్రారంభించిన కలైసెల్వి 2019 ఫిబ్రవరిలో అదే సంస్థకు తొలి మహిళా అధిపతిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కరైకుడి (తమిళనాడు)లోని సీఎస్ఐఆర్-సీఈసీఆర్ఐ డైరెక్టర్గా, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.