హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఆదివారం ఢిల్లీ నుంచి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ్టి రాత్రి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో పోలీసులు, ఇతర శాఖలతో కలిసి పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల పట్ల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కట్టలు తెగే అవకాశం ఉన్న చెరువులపై నిఘా వేసి, అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాల్లో అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించుకోవాలన్నారు. వరద ప్రవాహ సమయంలో ప్రజలు వాగులు, వంకలు దాటొద్దని కోరారు.