హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పాల్గొనేందుకు ప్రత్యేక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి ఉంటుందని,దాదాపు 25 వేలమందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు.
ఈ పరిశీలన సమయంలో సీఎస్తోపాటు అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ పోలీస్ కమీషనర్ శర్వానంద్ , డీసీపీ(ట్రాఫిక్ రంగనాధ్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, టీఎస్ఐసీసీ ఎండీ నరసింహారెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి తదితరులు ఉన్నారు.