శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాల యాత్రికులతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి సుమారు 30వేలకుపైగా భక్తులు తరలివచ్చారు. ఆదివారంతో పాటు అమావాస్య కావడంతో తెల్లవారు జాము నుంచే నదీ స్నానాలు చేసి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టగా శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు.
వందల సంఖ్యలో దంపతులు సామూహిక అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులు బసచేసేందుకు కావాల్సిన వసతి గదులు ఆన్లైన్లో అందుబాటులో లేకపోవడంతో దేవస్థాన కౌంటర్ల వద్ద సామాన్యులకు గదులు లేకపోవడంతో యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్వామిచ, అమ్మవార్ల ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపులో జాప్యం జరుగడంతో గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నా కావాల్సిన టికెట్లు దొరకడం లేదని పేర్కొంటున్నారు. ఆలయ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సోమవారం నుంచి ఆలయంలో శ్రావణ మసోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.