అహ్మదాబాద్: బ్యాకింగ్ పొరపాట్ల వల్ల కొందరు వ్యక్తులు కొన్ని గంటలపాటు కోటీశ్వరులవుతున్నారు. అదే మాదిరిగా ఒక వ్యక్తి ఖాతాలో పొరపాటున రూ.11,677 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ వ్యక్తి సుమారు ఒక రోజు కోటీశ్వరుడయ్యాడు. అయితే అనంతరం ఆ డబ్బులు వెనక్కి వెళ్లాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. రమేష్ సాగర్ గత ఐదేళ్లుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఏడాది కిందట కోటక్ సెక్యూరిటీస్లో డీమ్యాట్ ఖాతా తెరిచాడు.
కాగా, నెల రోజుల కిందట సాగర్ డీమ్యాట్ ఖాతాలో సుమారు 12 వేల కోట్లు జమ అయ్యాయి. జూలై 26న తన డీమ్యాట్ ఖాతాలో రూ.116,77,24,43,277.10 ఉంటడం చూసి అతడు షాకయ్యాడు. ఈ మొత్తం నుంచి రెండు కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. మరో ఐదు లక్షలకు లాభాలు బుక్ చేశాడు.
మరోవైపు అదే రోజు రాత్రి 8.30 గంటలకు సాగర్ డీమ్యాట్ ఖాతాలో పొరపాటున జమ అయిన కోట్లాది డబ్బు మాయమైంది. యాప్లోని మార్జిన్ అప్డేట్లో సమస్య వచ్చిందని, దీని వల్ల ఇలా జరిగిందంటూ ఆ బ్యాంకు నుంచి అతడికి మెసేజ్ వచ్చింది. ఆ రోజున కోటక్ సెక్యూరిటీస్ యాప్లో సాంకేతిక సమస్య వల్ల సాగర్ మాదిరిగా మరికొంత మంది వ్యక్తుల ఖాతాల్లో పొరపాటున కోట్లలో డబ్బులు జమ అయ్యాయి. దీంతో వారంతా ఒక్కరోజు కోటీశ్వరులయ్యారు. అయితే తరువాత విత్డ్రా అయ్యాయి.