నిజామాబాద్ జిల్లాలో 7,900 ఎకరాలు.. కామారెడ్డిలో 3,715 ఎకరాలు
వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా
ఖలీల్వాడి, జూలై 11: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 68 గ్రామాల్లో 6,690 ఎకరాల్లో వరి, 28 గ్రామాల్లో 1010 ఎకరాల్లో సోయాబీన్, పది గ్రామాల్లో 200 ఎకరాల్లో మక్కజొన్న పంట నీట మునిగినట్లు వివరించారు.
కామారెడ్డి జిల్లాలో..
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని 71 గ్రామాల్లో 3,715 ఎకరాల్లో పంట నీట మునిగినట్లు జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి సోమవారం తెలిపారు. జిల్లాలోని 22 మండలాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంట నష్టంపై సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,527 ఎకరాల్లో సోయాబీన్, 1,575 ఎకరాల్లో వరి పంట నీటి మునిగినట్లు చెప్పారు. 322 ఎకరాల్లో మక్కజొన్న, 105 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో మినుము, 40 ఎకరాల్లో పెసర, 86 ఎకరాల్లో కంది పంట నీట మునిగినట్లు వివరించారు.
మండలాల వారీగా పంట నష్టం వివరాలు
జుక్కల్ మండలంలోని 12 గ్రామాల్లో 272 ఎకరాల్లో సోయాపంట, 20 ఎకరాల్లో పత్తి, పెసర, బిచ్కుంద మండలంలోని ఏడు గ్రామాల్లో 425 ఎకరాల్లో సోయా, బీర్కూర్ మండలంలోని రెండు గ్రామాల్లో 1170 ఎకరాల్లో వరి, బాన్సువాడ మండలంలోని రెండు గ్రామాల్లో 130 ఎకరాల్లో మక్కజొన్న, మరో రెండు గ్రామాల్లో 160 ఎకరాల్లో వరి, మద్నుర్ మండలంలోని 16 గ్రామాల్లో 822 ఎకరాల్లో సోయా, నాలుగు గ్రామాల్లో 73 ఎకరాల్లో వరి, మరో నాలుగు గ్రామాల్లో 85 ఎకరాల్లో కంది, రెండు గ్రామాల్లో 50 ఎకరాల్లో పెసర పంటలు నీట మునిగాయి. గాంధారి మండలంలో 130 ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో మక్కజొన్న, ఎనిమిది ఎకరాల్లో సోయాబీన్, సదాశివనగర్ మండలంలో 95 ఎకరాల్లో పత్తి, 180 ఎకరాల్లో మక్కజొన్న నీట మునిగింది. పంటలో నిలిచిఉన్న వర్షపు నీటిని ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేలా చూడాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారిణి సూచించారు.