భోపాల్: ఏడేళ్ల బాలుడిపై ఒక మొసలి దాడి చేసింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆ మొసలిని పట్టుకున్నారు. దాని కడుపులోని బాలుడు బతికి ఉంటాడని అనుమానించి బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. అది అసాధ్యమని అటవీశాఖ అధికారులు నచ్చజెప్పడంతో చివరకు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. మధ్య ప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం చంబల్ నదిలో స్నేహితులతో కలిసి స్నానం చేస్తున్న ఏడేళ్ల అంతర్ సింగ్పై ఒక మొసలి దాడి చేసింది. అతడ్ని నోట కరచుకుని పోయింది.
కాగా, ఇది చూసిన బాలుడి స్నేహితులు సహాయం కోసం కేకలు వేశారు. దీంతో గ్రామస్తులు వెంటనే వలలతో ఆ మొసలిని పట్టుకుని నది ఒట్టుకు లాక్కొని వచ్చారు. తాళ్లతో దానిని బంధించారు. బాలుడ్ని మొసలి మింగే ఉంటుందని అనుమానించారు. దాని కడుపులో అతడు సజీవంగా ఉండవచ్చని వారు భావించారు. ఆ బాలుడి పేరును పలుమార్లు పిలిచారు. అలాగే మొసలి బాలుడ్ని నోట్లోకి తెచ్చుకుని నమిలివేయకుండా దాని నోట్లో కర్రలు ఉంచారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడకు వచ్చారు. మొసలి మింగిన తర్వాత కడుపు నుంచి బయటకు తీయడం అసాధ్యమని నచ్చజెప్పారు. అయితే కొన్ని గంటల తర్వాత గ్రామస్తులు ఆ మొసలిని అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. దీంతో వారు దానిని దూర ప్రాంతానికి తీసుకెళ్లి నదిలో విడిచిపెట్టారు.
కాగా, ఆ మరునాడు నదిలో బాలుడు అంతర్ సింగ్ మృతదేహం కనిపించింది. దీంతో ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Angry villagers Raghunathpur captured a crocodile for over seven hours so that they could recover the body of a 7 year-old boy who they thought the reptile had swallowed! pic.twitter.com/DKxGylYOzP
— Anurag Dwary (@Anurag_Dwary) July 13, 2022