అమరచింత : పంట పొలాల్లో ఓ భారీ మొసలి ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన రైతు తీవ్ర భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేశాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామ సమీపంలోని ఓ పంట పొలంలో రైతు కుంచే నర్సింహులు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా.. భారీ మొసలి ప్రత్యక్షమైంది.
దీంతో భయాందోళనకు గురైన రైతు గట్టిగా కేకలు వేయడంతో సమీప పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జిల్లా కేంద్రంలోని స్నేక్ సొసైటీ సభ్యుడు కృష్ణసాగర్కు సమాచారం అందించారు. కృష్ణసాగర్తో పాటు సొసైటీ సభ్యులు నరేశ్, వినోద్, సాయి, దేవేందర్, అవినాథ్ తదితరులు అక్కడకు చేరుకొని రైతుల సాయంతో తాళ్లతో మొసలిని బంధించారు. అనంతరం జూరాల ప్రాజెక్టులో వదిలిపెట్టారు.